వైసీపీ : మసిగుడ్డ కాల్చి మొహాన వేసే కుట్రలు!

అధికారంలో ఉన్న కూటమి పార్టీల  మీద జీవితం మొత్తం బురద చల్లుతూ, నిందలు వేస్తూ బతకడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద రకరకాల ఐడియాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేసినా సరే.. దానిని అడ్డంగా వాదిస్తూ, వక్రభాష్యాలు చెబుతూ.. మా జగనన్న ప్రాణాలకు రక్షణ లేదు.. జగనన్నను చంపేయాలనుకుంటున్నారు.. అంటూ యాగీ చేయడం వారికి పరిపాటి అయిపోయింది. అయిన దానికీ కానిదానికీ జగన్ మీద కుట్రలు జరుగుతున్నట్టుగా ప్రచారాలు చేస్తున్న వారి కుటిల వైఖరి.. నాన్నా పులి కథ లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువు తీసేలా తయారవుతోంది. తాజా ఉదాహరణను గమనిస్తే ఈ వ్యవహారం ఎవ్వరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది.

జగన్మోహన్ రెడ్డి తాజాగా నెల్లూరు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు గాను అక్కడ ఒక ప్రెవేటు విద్యా సంస్థ వారిని, వారి గ్రౌండు తమ హెలిప్యాడ్ కోసం ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. ఒకసారి జగన్ హెలిప్యాడ్ కు పర్మిషన్ ఇస్తే.. తమ స్కూలు గ్రౌండు సంగతి ఏమవుతుందో వారికి బాగా తెలుసు. జగన్ అడుగు పెట్టి వెళ్లిన తర్వాత.. ఆ జాగా మొత్తం కుక్కలు చింపిన విస్తరిలాగా మారుతుందని వారికి అవగాహన ఉంది. అందుకే వారు నో చెప్పారు. అయితే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే.. దానిని చంద్రబాబునాయుడు కుట్రగా అభివర్ణించడానికి సవాలక్ష మార్గాలు కనుగొంటూ ఉండే.. జగన్ దళాలు విషం చిమ్ముతున్న తీరు ఎలా ఉన్నదో తెలుసా?

‘జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదట… జగన్ కు హెలిప్యాడ్ కోసం స్కూలు గ్రౌండ్ ఇవ్వవద్దు అని ప్రభుత్వమే ఆ యాజమాన్యాన్ని బెదిరించిందిట’ ఇలా చాటుకుంటున్నారు.
జగన్ హెలిప్యాడ్ కు స్కూలు గ్రౌండు ఇవ్వడం అంటూ జరిగితే అది ఏ రకంగా సర్వనాశనం అయిపోతుందో అందరికీ తెలుసు. పాపిరెడ్డి పల్లిలో హెలిప్యాడ్ వద్దకు కార్యకర్తలు ఎవరూ రారాదని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ.. వందల మంది అక్కడకు ఎగబడి వచ్చి.. హెలికాప్టర్ నే దెబ్బతీసిన సంగతి అందరికీ తెలుసు.

స్కూలు గ్రౌండ్ లో అలా జరగదని.. పార్టీ నాయకులు హామీ ఇచ్చే అవకాశమూ లేదు. ఆ పార్టీ మూకలు అక్కడకు వచ్చి చేసే విధ్వంసానికి స్కూలు బిల్డింగు కూడా దెబ్బతినవచ్చుననేది పాఠశాల వారి భయం.
తమకు అనుమతులు ఇవ్వకపోతే.. అక్కడికేదో ఆ స్కూలు కూటమి ప్రభుత్వంతో అంటకాగుతున్నట్టుగా, పాలకులు వారిని బెదిరిస్తున్నట్టుగా మసిగుడ్డ కాల్చి వారి మొహాన వేసేయాలనే కుటిలనీతితోనే ఆ పార్టీ వ్యవహరిస్తోందని ప్రజలు ఈసడించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories