జర్నలిస్టులు ఆధునిక సమాజంలో ఏ రకంగా అయినా పతనం అయిపోయి ఉండవచ్చు. కానీ సాధారణ పౌరులు ఇంకా- జర్నలిస్టులనే వారు నైతిక విలువలు పాటిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. నైతిక విలువలు లేకుండా వారు వ్యవహరించినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు.సాక్షి టీవీలో లైవ్ చర్చావేదిక నిర్వహించే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో కూడా అదే జరిగింది. దరిమిలా ఆయన అరెస్టు అయ్యారు. తాజాగా ఆయనకు సుప్రీం కోర్టు బెయిలు కూడా మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. అదే సమయంలో.. ఒకవైపు సాక్షి మీడియా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమిలిగా పండగ చేసుకుంటున్నాయి. అయితే బెయిలు నేపథ్యంలో అసలు కొమ్మినేని వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు.. ఆయన పాటించేవి.. జగన్ భక్త విలువలే తప్ప నైతిక విలువలు కాదు అనేది మనకు అర్థమవుతుంది. జగన్ కళ్లలో ఆనందం చూడడానికే ఆయన ఆ లైవ్ షో ను తదనుగుణంగా నిర్వహిస్తుంటారని కూడా అర్థమవుతుంది.
కొమ్మినేని లైవ్ షోలో జర్నలిస్టు క్రిష్ణంరాజు అనే వ్యక్తి.. అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది. ఈ వివాదంలో ముందుగా కేఎస్ఆర్ అరెస్టు అయ్యారు. ఈ కేసులో బెయిలు కోసం ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు.. ఆయన లైవ్ షోలో అతిథి ఆ మాటలు చెప్పారే తప్ప.. కొమ్మినేని ఆ వ్యాఖ్యలు చేయలేదని వాదించారు. ఆ అంశం పరిగణించిన సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఇక్కడ కొమ్మినేని కనీస నైతిక విలువలను పాటిస్తున్నారా? లేదా? అనేది ఇంకా సందేహాస్పదంగానే ఉంది.
ఎందుకంటే.. తన షోలో క్రిష్ణంరాజు అలాంటి నీచమైన భాష వాడినప్పుడు.. కొమ్మినేని తక్షణం ఆయనను వారించి, షో నుంచి బయటకు పంపి ఉంటే.. లేదా, మాట అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించి ఉంటే చాలా మర్యాదగా ఉండేది. కానీ కొమ్మినేని అలా ప్రవర్తించలేదు. వెకిలినవ్వులు నవ్వుతూ.. ఇలా మాట్లాడితే మళ్లీ వారు మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారేమో అంటూ క్రిష్ణం రాజు మీదనే వెకిలి సానుభూతి చూపించారు. కేసులు నమోదు అయి, వివాదం రాజుకున్న తర్వాత అయినా ఆయన తన షో ద్వారా అలాంటి వ్యాఖ్యలు వచ్చినందుకు క్షమాపణ చెప్పి ఉంటే చాలా మర్యాదగా ఉండేది. ఆ పని కూడా చేయలేదు. పైగా అమరావతి మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. వారి నిరసనల వల్ల జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నొచ్చుకుని ఉంటే గనుక.. వారిని క్షమాపణ కోరుతున్నట్టుగా చవకబారు మాటలు వల్లించారు. జగన్ భక్తిని ప్రదర్శించారు.
అదే కొమ్మినేని కొన్ని రోజుల కిందట లక్ష్మీ పార్వతి లైవ్ షోలో ఉండగా.. ఒక వ్యక్తి లైవ్ లో కాల్ చేసి.. ఆమె గురించి పలచనగా మాట్లాడినప్పుడు.. కొమ్మినేని ఆగ్రహోదగ్రులయ్యారు. ‘మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా, అక్క చెల్లెళ్లు లేరా.. అంటూ తూలనాడారు. మైకు కట్ చేయించారు. నానా తిట్లు తిట్టారు. కానీ అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు మాత్రం.. ఆయనలోని అసలు వెకిలితనం బయటకు వచ్చింది.
ఇవాళంటే సుప్రీం కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చి ఉండొచ్చు గానీ.. నిజానికి కేసు కోర్టు ఎదుట పూర్తిస్థాయిలో విచారణ జరిగినప్పుడు.. ఈ వ్యాఖ్యలు కావాలనే ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసినవిగా తేలుతాయని, ఆ కుట్ర వెనుక ఉన్న వారందరూ బయటకు వస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు.