జగన్ మాటల్లో అంతరార్థం ఏమిటి? బురద ఎవరిమీద?

వైఎస్ జగన్ రెంటపాళ్లను సందర్శించారు. ఏమాత్రం కొత్తదనం లేకుండా.. పోలీసుల మీద ప్రభుత్వం మీద వరుచుకుపడ్డారు. పోలీసుల్లో ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తానని సవాలు చేశారు. మరో మూడునాలుగేళ్లలో తమ ప్రభుత్వం వచ్చేస్తుందని కూడా ప్రగల్భాలు పలికారు. అయితే రెంటపాళ్లలో పోలీసుల మీద రెచ్చిపోయే సందర్భంలో జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన పరిపాలన కాలంలో.. ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఆయన వెనుక గోతులు తవ్వారని అనుకుంటున్నారా? లేదా, ఎన్నికల సంఘం మీదనే బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి సాహసిస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు.
రెంటపాళ్లలో జగన్ మాట్లాడుతూ.. ఏ కుటుంబాన్ని అయితే తాను పరామర్శించడానికి వెళ్లాడో.. సదరు నాగమల్లేశ్వరరావును గత ఏడాది ఎన్నికల ఫలితాల తరువాత పోలీసులు వేధించారని, తుపాకీతో కాల్చి చంపుతామని బెదిరించారని అంటున్నారు. ఆయన అతిశయమైన ఆరోపణలు చేస్తుండవచ్చు గానీ.. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నప్పుడు అల్లర్లకు పాల్పడే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెడుతుండడం కద్దు. అలాంటి పోలీసు హెచ్చరికకు జగన్ హత్యాయత్నం స్థాయిలో రంగుపులమాలని ఆరాటపడుతున్నారు. అదొక ఎత్తయితే.. ఆయన చేసిన మరో కీలక ఆరోపణ కూడా ఉంది.

గత ఏడాది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ వారు తమకు అనుకూలమైన అధికారులకు ఇక్కడ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఇక్కడి ఐజీ, ఎస్పీ, సీఐ అందరూ కూడా తెలుగుదేశం కూటమిని గెలిపించేందుకు ఎలాంటి అన్యాయాలు చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు.. అని జగన్ అంటున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. ఇంతకూ ఆయన తన ప్రభుత్వంలోనే తెలుగుదేశం తమ అనుకూలురకు పోస్టింగులు ఇప్పించుకున్నదని అంటున్నారా? లేదా, కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘం వేసిన పోస్టింగులను తప్పుపడుతున్నారా అనేది అర్థం కావడం లేదు.
ఐజీ, ఎస్పీ, సీఐ అందరూ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారని ఆరోపించడం అంటే.. ఎన్నికల సంఘం చేసిన నియామకాల్ని మాత్రమే కాదు.. వారి మీద ఒత్తిడి చేసి అలాంటి పోస్టింగులు వేయించారని.. ఇండైరక్టుగా కేంద్రప్రభుత్వం మీద కూడా నిందలు వేస్తున్నట్టే లెక్క.

జగన్ అయిదేళ్ల పరిపాలనను భరించలేక ప్రజలు ఛీత్కరించుకుని ఆయనకు అత్యంత నీచమైన ఓటమిని కట్టబెడితే.. తొలినాటినుంచి కూడా ఎన్నికల్లో అక్రమాలు చేయడం ద్వారా ఎన్డీయే కూటమి గెలిచిందని పసలేని ఆరోపణలు చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏడాది గడిచిన తర్వాత కూడా ఆయన బుద్ధి మారడం లేదు. ఇప్పటికీ.. ఎన్డీయే కూటమి గెలవడానికి కుట్రలు జరిగాయని అర్థం వచ్చేలా నిందలు వేస్తూ  ఆత్మ వంచన చేసుకోవడం ఆయనకు మాత్రమే చెల్లుబాటు అవుతోందని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories