పోలీసు నిబంధనలను ఖాతరు చేయకుండా, వాటిని తుంగలో తొక్కి రెచ్చిపోవడం మాత్రమే తన ప్రాథమిక లక్ష్యం అన్నట్టుగా.. రెంటపాళ్ల పర్యటన సమయంలో అతిచేసిన జగన్మోహన్ రెడ్డి స్వయంగా.. తన పార్టీ కార్యకర్త ప్రాణాన్నే బలి తీసుకున్నారు. అతి చేయకుండా కాన్వాయ్ తో పాటుగా కొన్ని వాహనాలు మాత్రమే తీసుకురావాలని పోలీసులు ముందే సూచించినప్పటికీ.. కావాలనే అతి చేసిన జగన్.. యాభై వాహనాలతో తాడేపల్లిలోని ప్యాలెస్ నుంచి రెంటపాళ్ల వరకు ర్యాలీ తీశారు. ఈ క్రమంలో అలవాటుగా భారీ జనసందోహాన్ని తరలించారు.
చావు ఇంటికి పరామర్శకు వెళుతూ.. డీజేలతో, నృత్యాలతో, కేకలు అరుపులతో నానా బీభత్సం సృష్టిస్తూ సాగారు. ఇలాంటి పరామర్శ బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండకపోవచ్చు. ఈ ఓవరాక్షన్ లో జగన్ కారు కింద పడి సింగయ్య అనే వైసీపీ వృద్ధ కార్యకర్త మరణించాడు. వీడియో సాక్ష్యాలు కూడా వెలుగులోకి రావడంతో.. కారునడిపిన డ్రైవరు మొదటి నిందితుడిగా, జగన్ ఏ2 గా కేసులు నమోదు అయ్యాయి. జగన్ తనంత తాను ఆ పాట్లు పడుతున్నారు.
తమకు సంబంధం లేని ఈ వ్యవహారంలో తల దూర్చి సీపీఐ రామక్రిష్ణ అభాసుపాలవుతున్నారు. ఆయన చెబుతున్న ప్రకారం.. అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టనే కూడదంట. జగన్ మీద కేసు నమోదు చేయడం చాలా దారుణం అని రామక్రిష్ణ విలపిస్తున్నారు.
ఈ ఎపిసోడ్ ఏపీలో సీపీఐ రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఏదో ఒక పెద్ద పార్టీ అండ కోరుకుంటూ మనుగడ సాగించే సీపీఐ కి ఇప్పుడు ఏపీలో అస్తిత్వ సమస్య ఉంది. సాధారణంగా వారు ప్రవచిస్తూ ఉండే విధానాలనే చంద్రబాబు అమలు చేస్తూ వస్తున్నారు గానీ.. వాటిగురించి మాట్లాడ్డానికి సీపీఐ రామక్రిష్ణకు నోరురావడం లేదు. పనిగట్టుకుని జగన్ ను కీర్తించడానికి ఆయన పూనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు నిర్వీర్యమై పోయారని సెలవిస్తున్నారు. సీఎం కాన్వాయ్ లో ప్రమాదం జరిగితే చంద్రబాబు మీద కేసు పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత తలాతోకాలేని చిల్లర విమర్శలు ఇటీవలి కాలంలో మరెక్కడా వినలేదని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కాన్వాయ్ లలో, లేదా తొక్కిసలాటల్లో జరిగే మరణాలకు, జగన్ కేవలం తన ఓవరాక్షన్ వల్ల బలిగొన్న ప్రాణానికి ఏమైనా పోలిక ఉందా? అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.