తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరంటే నిర్మాతగానే కాక, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్ని నిర్మించి తనదైన ముద్ర వేసిన దిల్ రాజు తాజాగా నితిన్ హీరోగా నిర్మిస్తున్న సినిమా తమ్ముడు గురించి మాట్లాడారు. ఈ సినిమా టైటిల్లో పవన్ కళ్యాణ్ టచ్ ఉండటం విశేషం. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది.
అయితే ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. తన కెరీర్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో స్టార్ హీరోలు ఎలా మద్దతుగా నిలిచారనే విషయాన్ని చాలా ఎమోషనల్గా పంచుకున్నారు. ‘బృందావనం’ సినిమా సమయంలో ఎన్టీఆర్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సమయంలో ప్రభాస్, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైమ్లో మహేష్ బాబు, అలాగే ‘వకీల్ సాబ్’ సందర్భంగా పవన్ కళ్యాణ్ తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రతి విషయంలో ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నారు.
వాళ్లు సినిమాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడి తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని, నెగెటివ్ ఆలోచనలు రానివ్వకుండా ధైర్యం చెప్పిన తీరు తను జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. వారి సహాయంతోనే తాను ఎలాంటి సమయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొగలిగానని చెప్తూ, వారిపట్ల ఉన్న గౌరవాన్ని మనసుపూర్వకంగా వ్యక్తం చేశారు.
దిల్ రాజు చెప్పిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న మానవ సంబంధాల గొప్పతనాన్ని ఇవి మరోసారి రుజువు చేస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.