ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత రంగంలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ఇళయరాజా–బాలసుబ్రహ్మణ్యం మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ సన్నిహితులను కోల్పోయినా భావోద్వేగాలను బయటపెట్టని ఇళయరాజా, బాలుగారి మరణం సమయంలో మాత్రం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారని రజనీకాంత్ చెప్పారు.
అలాగే తన నటజీవితంలో ఇళయరాజాతో ఏర్పడిన అనుబంధాన్ని రజనీకాంత్ మరోసారి గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా నటించిన జానీ సినిమా సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా సంఘటనలను నెమరువేసుకున్నారు. అదే కార్యక్రమంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడి, 1988లో కరుణానిధి యాదృచ్ఛికంగా ఇళయరాజాకు ఇసైజ్ఞాని అనే బిరుదు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక కమల్హాసన్ అయితే తనకు ఎప్పటినుంచీ ఇళయరాజా కోసం పీఆర్వోలా వ్యవహరించే అలవాటు ఉందని నవ్వుతూ చెప్పుకొచ్చారు.