మితి మీరిన అహంకారంతో.. వైఎస్ జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం.. అత్యంత నీచమైన వ్యాఖ్యలతో అమరావతి మహిళలను అవమానించిన సూడో జర్నలిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు విశాఖపట్నంజిల్లా తగరపు వలస వద్ద అరెస్టు చేశారు. ఆయన కొన్నాళ్లుగా పరారీలో ఉన్నారు. విజయనగరంలో తలదాచుకున్న కృష్ణంరాజు అక్కడినుంచి కూడా పరారవుతుండగా పోలీసులు వాహనాన్ని అడ్డుకుని అరెస్టు చేశారు.
సాక్షి టీవీ ఛానెల్ ఆరోతేదీన నిర్వహించిన కెఎస్ఆర్ లైవ్ర షో చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు వివాదాస్పద అసభ్య వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సెక్స్ వర్కర్ల గణాంకాల గురించి ఒక అధ్యయనం నివేదికను ఆధారంగా చేసుకుని అనుచితమైన రీతిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన మాట్లాడిన తీరు, చేసిన ఆరోపణలు, వేసిన నిందలు రాష్ట్రవ్యాప్తంగా అభిమానం గల మహిళలను బాధించాయి. రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. కృష్ణంరాజుతోపాటు, లైవ్ షో నిర్వహించిన ఆయనను నిలువరించకపోగా, వ్యాఖ్యలను సమర్థిస్తూ అదే చర్చ కొద్దిసేపు కొనసాగడానికి కారణమైన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. దళిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో కేఎస్సార్ ను హైదరాబాదులోని ఆయన నివాసంనుంచి ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
ఒకవైపు సాక్షి టీవీ నానా యాగీ చేయడం ప్రారంభించింది. జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించింది. రాష్ట్రమంతా ఒకవైపు సాక్షి దుర్మార్గపు తీరుతెన్నుల మీద నిరసనజ్వాలలు వెల్లువెత్తుతుండగా.. కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించింది. తమ ఛానెల్ ద్వారా అమరావతి మీద విషం కక్కడానికి జరిగిన ప్రయత్నానికి.. క్షమాపణ చెప్పకపోగా.. దానిని సమర్థించుకుంటూ వ్యాఖ్యలు రువ్వారు. భారతి గానీ, జగన్ గానీ, చివరకు కార్యక్రమానికి యాంకర్ అయిన కొమ్మినేని గానీ, వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గానీ ఎవ్వరూ కనీస క్షమాపణ చెప్పనే లేదు.
పరారీలో ఉన్న కృష్ణంరాజు కోసం పోలీసులు మూడు బృందాలుగా గాలింపులు చేపట్టారు. సెల్ టవర్ ఆధారంగా మొత్తానికి ఆయన ఆచూకీ పసిగట్టారు. పరారవుతున్న సమయంలో ఆయన వెంట ఉండి, పరారు కావడానికి సహకరిస్తున్న మరో ఇద్దరితో కలిసి అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. గురువారం ఆయనను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.