అసందర్భంగా రాజధాని నగరం ప్రస్తావన తీసుకువచ్చి.. ‘అమరావతి అనేది దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని’’ అని అత్యంత నీచమైన, హేయమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు.. జర్నలిస్టు ముసుగులో తెలుగుదేశం వ్యతిరేక కారుకూతలు కూయడానికి, స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెంచిపోషించిన పాము అనే సంగతి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. అవిపూర్తిగా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలతో లైవ్ షో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకుగాని, సాక్షి ఛానెల్ యాజమన్యానికి గానీ ఎటువంటి సంబంధమూ లేదు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండవచ్చు గాక.. కానీ.. కృష్ణంరాజును కస్టడీకి తీసుకుని విచారించడంలో.. ఆయన చెప్పిన మాటలను బట్టే.. ఈ సంగతి ధ్రువపడుతోంది.
వీవీఆర్ కృష్ణంరాజు అనే ఈ మాజీ జర్నలిస్టు.. తన జర్నలిస్టు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నామ్ కే వాస్తేగా ఒక యూట్యూబ్ చానెల్ ను, ఒక పత్రికను నడుపుతున్న బిల్డప్ తో వ్యవహరిస్తుంటారు. అవి పాపులర్ అయినవి కూడా కాదు. ఆయనే సాక్షి టీవీ చానెల్ డిబేట్ లో అమరావతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అరెస్టు అయ్యారు. పోలీసులు ఆయనను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నప్పుడు.. ఆయన అనేక విషయాలు వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ల తనకు మితిమీరిన ద్వేషం ఉన్నదని.. ఆయనమీద కక్షతోనే అమరావతి మీద విషం కక్కానని ఆయన ఒప్పుకున్నారు.
అయితే ఆయన బ్యాంకు ఖాతాల్లో అయిన డిపాజిట్ల వివరాలను కూడా సేకరించిన పోలీసు అధికారులు సాక్షి వారు గానీ, వివిధ వైసీపీ నాయకులు గానీ ఆయన అకౌంట్లో డబ్బులు ఎందుకు వేశారని ప్రశ్నించినప్పుడు అసలు సంగతి బయటకు వచ్చింది. సాక్షి చానెల్ తనకు వేలల్లో చెల్లింపులు చేసినట్టుగా ఆయన ఒప్పుకున్నారు. దీనిని బట్టి.. సాక్షి కోరుకునే రీతిలో.. టీవీ డిబేట్లలో కూర్చుని చంద్రబాబునాయుడు మీద విషం కక్కడానికి ఆయన సాక్షి నుంచి కూలీ తీసుకుంటున్నారని అర్థమవుతోంది. అలాంటప్పుడు.. వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కూడా సాక్షి పాత్ర లేకుండా ఉంటుందని అనుకోవాల్సిందే అని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయంలో సాక్షి తాము చాలా నిజాయితీ పరులం అని నిరూపించుకోవాలంటే.. డిస్కషన్లకు వచ్చే అందరు అతిథులకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టుగా లెక్కలు చూపిస్తే సరిపోతుంది. కానీ.. అలా జరగడం లేదన్నది స్పష్టం. అదే విధంగా తన యూట్యూబ్ చానెల్ కు వైసీపీ నాయకులు యాడ్స్ ఇస్తుంటారని, అందుకే తన అకౌంట్లో డబ్బులు వేస్తుంటారని కృష్ణం రాజు వాదించడం కూడా ఆయనను ఇరుకున పెట్టే విధంగానే ఉంది. ఆయన మరింతగా ఇరుక్కుంటున్నారనే సంగతి పక్కన పెడితే.. వైసీపీ నాయకులు.. డబ్బులిచ్చి మరీ.. చంద్రబాబు మీద విషం చిమ్మే వారిని కూలికి కుదుర్చుకుంటున్నారని స్పష్టం అవుతోంది.