అప్పటి పాపాలు ఇప్పుడు పండుతున్నాయి!

అధికారం తమ చేతిలో ఉన్నది కదా అని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు.. దుందుడుకుతనంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం కార్యకర్తలను విచ్చలవిడిగా కొట్టి దాష్టీకం చూపించారు. ‘మా మీద దాడి జరిగింది మహాప్రభో..’ అని పోలీసులకు మొరపెట్టుకుంటే బధిరాంధ శంఖారావమే అయింది. ఇన్నాళ్లుగా ఆ కేసుల గురించి పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పాత కేసులను పోలీసులు తిరగతోడుతున్నారు. అప్పుడు అధికారంతో కళ్లుమూసుకుపోయిన వారు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాల మీద చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఉపక్రమిస్తున్నారు.

2021 అక్టోబర్ 19న మంగళగిరి సమీపంలోని టిడిపి కేంద్ర కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తదితర నాయకుల అనుచరులే ఈ దాడికి తెగబడినట్లుగా ఇప్పుడు పోలీసులు గుర్తించారు.  వారు కర్రలు రాడ్లతో వచ్చి టిడిపి కార్యాలయం గేట్లు విరగ్గొట్టి లోపలికి దూసుకెళ్లి బీభత్సంగా విధ్వంసం సృష్టించారు. అడ్డు వచ్చిన వారిని కొట్టారు. అప్పుడు చేసిన ఫిర్యాదుల గురించి ఇన్నాళ్లుగా ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు స్పందించిన పోలీసులు సిసి టీవీ ఫుటేజీలను వెలికి తీసి వాటి ఆధారంగా నిందితులను గుర్తి స్తున్నారు. ఒక ఎమ్మెల్సీ ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 150 మందికి పైగా వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యే అవకాశం ఉండగా, కీలకంగా దాడిలో పాల్గొన్న కొందరు వైసిపి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పు చేస్తే ఎప్పటికైనా సరే దాని ఫలితం అనుభవించాల్సిందే. దుందుడుకుతనానికి పరిహారం చెల్లించాల్సిందే.. అని ఈ చర్యలు నిరూపిస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories