ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని, సర్వతోముఖ వికాసాన్ని సమపాళ్లలో రంగరించి ఏ రకంగా పరిపాలన సాగిస్తున్నదో ప్రజలందరికీ తెలుసు. అయితే సోషల్ మీడియా రకరకాల వికృత పోకడలకు, రాజకీయ దుష్ప్రచారాలకు కూడా ఆలవాలమవుతున్న ఇవాల్టి రోజులలో కేవలం మంచి పరిపాలనను అందించడం ఒక్కటే సరిపోదు. పాలకులు మంచిగా ఉన్నారని, మంచిగా పనిచేస్తున్నారని క్షేత్రస్థాయిలోని, మారుమూల గ్రామాలలోని చివరి వ్యక్తి వరకు తెలియజేయడం కూడా ఒక అవసరం. ఎందుకంటే ఎవరిమీదనైతే తాము అపారమైన విశ్వాసం పెంచుకుని, అధికార పీఠం మీద కూర్చోబెట్టామో వారు ఎలా పని చేస్తున్నారో తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంది. వారి పనితీరును ప్రజలకు తెలియజేయడం అనేది ప్రజలలో మరింతగా నమ్మకాన్ని పెంచుతుంది. వారికి భరోసా ఇస్తుంది. ఈ ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో అమలు చేస్తున్న కార్యక్రమం ‘సుపరిపాలనలో తొలి అడుగు’!
ఈ కార్యక్రమం కింద జూన్ 23వ తేదీ నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించి చెప్పాలని చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాలలో పెద్ద స్థాయి నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు తమ తమ పరిధిలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని అంటున్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పాలి. ఎందుకంటే- ఎన్నికలలో ప్రజలు తీర్పు ఇచ్చి గెలిచిన తర్వాత నాయకులు మరోసారి ఎన్నికలు వచ్చేవరకు ప్రజల మొహం చూడకుండా తమ తమ వ్యవహారాలలో తాము నిమగ్నం అయిపోవడం అనేది నిన్నటిదాకా ఉన్న సంస్కృతి. ఇవాళ రోజులు మారుతున్నాయి. అందుకే ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు చూపించడం అనేది అవసరం.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో నాలుగేళ్ల పాలన పూర్తయిన తర్వాత- అంటే మరికొంత కాలంలో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయనగా ఎమ్మెల్యేలను పురమాయించి ఇంటింటికి పంపే ఆలోచన అమలు చేశారు జగన్. అయితే అది కేవలం ఎన్నికల గిమ్మిక్కు అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయి గనుక నాయకులు తమ చెంతకు వచ్చి నాటకాలు ఆడుతున్నారని వారు గ్రహించారు. అలాంటి అవకాశం లేకుండా, అనుమానం కూడా కలగకుండా, అపోహ ఏర్పడకుండా మొదటి సంవత్సరం పరిపాలన పూర్తయిన సందర్భంలోనే ఒక నెలరోజుల పాటు నాయకులను ప్రజలందరి ఇళ్లకు పంపడం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న సాహసం అని చెప్పాలి.
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో శక్తివంచన లేకుండా ముందుకు తీసుకు వెళుతున్నామనే, సంక్షేమ పథకాలను కూడా మరింత మెరుగ్గా పారదర్శకంగా అమలు చేస్తున్నామనే ఆత్మవిశ్వాసమే కూటమి ప్రభుత్వాన్ని ఈ సాహసానికి పురిగొల్పుతోంది. ప్రజలు కొన్ని హామీల పట్ల కొంత అసంతృప్తితో ఉండవచ్చు. అయితే ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలు అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగని మేనిఫెస్టోలోని నూటికి నూరు శాతం అమలయ్యాయని కాదు. కానీ ఇప్పటికి ఒక ఏడాది పాలన మాత్రమే పూర్తయిందనే సంగతిని కూడా గుర్తుంచుకోవాలి.
ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ మూకలు ప్రభుత్వం మీద విషం కక్కుతున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటిదాకా అమలు కాని హామీలే విషయంలో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నారో కూడా నాయకులు ప్రజలకు వివరించి చెబుతారు. అలాగే ముఖ్యమైన అన్ని హామీలను ఈ ఒక్క ఏడాదిలోని అమలు చేసిన తీరు గురించి కూడా ప్రజలకు వివరిస్తారు. ఏమైనా స్థానికంగా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకుని తీర్చడానికి ప్రయత్నిస్తారు. మొదటి ఏడాది పూర్తయినప్పుడే ప్రజల వద్దకు వెళ్లడం ఒక మంచి పరిణామం. ప్రజల సమస్యలు ఏమిటో ఇప్పుడే తెలుసుకుంటే వాటిని పరిష్కరించడానికి కనీసం నాలుగేళ్ల వ్యవధి ఉంటుంది. ఆలోగా ప్రభుత్వం మరింత ప్రజా రంజకమైన పాలన అందించగలుగుతుంది అని పలువురు విశ్లేషిస్తున్నారు.