‘మళ్లీ అధికారంలోకి వచ్చాక.. చంపేస్తాం, నరికేస్తాం’.. ‘ఎవడైనా రానీ.. తొక్కిపడేస్తాం’, ‘2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’, ‘రప్పా రప్పా నరుకుతాం నా కొడకల్లారా’, ‘వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు’.. ఇవన్నీ ఏ దొమ్మీలోనో కొట్లాటల్లోనే తెలుగుదేశం వారి మీదికి ఎగబడుతూ వైసీపీ కార్యకర్తలు వేసిన పొలికేకలు కాదు. లేదా.. వారి రహస్య సమావేశాల్లో మాట్లాడుకున్న, ప్లాన్ చేసుకున్న కార్యచరణ ప్రణాళిక కూడా కాదు. బహిరంగంగా.. ఎలాంటి అనుమతులు లేకుండా.. పోలీసుల్ని, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సాగించిన రోడ్ షోలో.. ‘సీఎం సీఎం’ అంటూ పొలికేకలు పెడుతూ.. డ్యాన్సులు చేస్తూ, తాగి చిందులు వేస్తూ వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పెద్దపెద్ద ప్లకార్డులు!
ఇవన్నీ కేవలం కార్యకర్తలు అత్యుత్సాహంతో ఫ్లెక్సిలుగా ప్రింట్ చేయించుకుని ప్లకార్డులుగా ప్రదర్శనలో చూపించి డాన్సులు ఆడినవి మాత్రమే కాదు. తమ అధినేత కళ్లలో ఆనందం చూడాలని అనుకునే నాయకులు వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలే. అయితే ఇలాంటి ప్లకార్డులు పట్టుకున్న వారిలో రవితేజ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగిఉన్నట్టుగా వైసీపీ నేతలు ఒక ఆధారం కూడా సంపాదించారు. తెలుగుదేశం వాళ్లే తమ ర్యాలీని అభాసుపాలు చేయడానికి ఇలా తమ కార్యకర్తలతో ఫ్లెక్సిలు పంపారని ఆరోపిస్తున్న వారు కొందరు కాగా, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్త.. చంద్రబాబు మీద విసిగిపోయి.. మన అభిమానస్తుడిగా మారిపోయి చంద్రబాబును నరకాలనుకుంటున్నాడని ఆనందిస్తున్నారు.
ఇలాంటి ప్లకార్డులు ఈ ర్యాలీలో అనేక మంది పట్టుకుని ఊరేగారు. ఒక్కడు తెలుగుదేశం కార్యకర్త అంటున్నారు సరే, మిగిలిన వారి సంగతేమిటి. ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మీడియా కెమెరాలు తమ ఎదుటకు వచ్చినప్పుడు చిందులు తొక్కిన వారి మాటేమిటి? వారందరూ వైసీపీ కార్యకర్తలే కదా? వారికి ఇలాంటి ఫ్లెక్సిలు ఇచ్చి పంపిన వాళ్లెవరు. ఎందుకు అలా చేశారు. చచ్చిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించే పేరుతో యాత్ర పెట్టుకుని.. ఇలాంటివి ప్రదర్శించడం ద్వారా వారు తమ రాజకీయ ప్రత్యర్థులను హింసాత్మక ఆలోచనలవైపు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని అర్థమవుతోంది.
ఒక్క రవితేజ మాత్రమే కాదు కదా.. ఇలాంటి ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో కనిపించిన ప్రతి ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేసి వారిని వెనుకనుంచి నడిపించినది ఎవరో రాబట్టాలి? ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేశారో కనిపెట్టాలి. ఆ పార్టీ కార్యకర్తలు అమాయకంగా, తాము కేసుల్లో చిక్కుకుంటామనే స్పృహ కూడా లేకుండా.. జగన్ మనసులోని కోరికలను తమ ఫ్లెక్సిల్లో ప్రదర్శించి ఇప్పుడు ఇరుక్కుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు.