పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’కి చాలా ప్రత్యేకత ఉంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుండి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు సమాచారం.
ప్రభాస్ సినిమా సెట్స్లో ఉండే ప్రతి ఒక్కరు చెప్తే చెప్పేది ఒకే విషయం – ఆయన ఆతిథ్యం గురించి. ఆయన ఎప్పుడూ తనతో పని చేసే నటీనటులకు, టెక్నీషియన్స్కి తినిపించడంలో ఎంతో ప్రేమ చూపిస్తాడు. ఫుడ్ లవర్గా ఉన్న ప్రభాస్, తన జట్టులో ఉన్న వాళ్లని సంతోషపెట్టడం కోసం ఎప్పుడూ మంచి భోజనం ఏర్పాటు చేస్తుంటాడు.
ఇక ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా చేరిపోయారు. ఆయన కూడా ‘ది రాజా సాబ్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలి ఒక మీడియా ఇంటర్వ్యూలో సంజయ్ మాట్లాడుతూ – ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు చాలా తిండిపూటలే ఎక్కువయ్యాయని, దానికి కారణం ప్రభాస్ మాత్రమేనని చెప్పారు. ప్రభాస్ అందించే విందుల వల్లనే తాను ఎక్కువగా తినాల్సి వచ్చిందని హాస్యంగా చెప్పారు.
ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. సినిమా గురించి ఆసక్తిగా ఉన్న ఫ్యాన్స్కు ఇది మరో ఆసక్తికరమైన అప్డేట్ గా మారింది.