విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు ఆయన చెప్పింది మాత్రమే ఎవరైనా వినాలి. ఏమైనా ఎదురు ప్రశ్నలు వేస్తే ఆయన ఆగ్రహంతో ఊగిపోతారు! ప్రభుత్వ అధినేతగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా ప్రెస్ మీట్ లలో తనని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగిన వారి పట్ల కొంత సామరస్యంగా వ్యవహరిస్తారేమో గానీ.. ఆయన మాత్రం చిందులు తొక్కుతారు. నాటకీయమైన గ్రాంథిక భాషలో ప్రాసతో కూడిన పదప్రయోగాలు చేస్తూ.. రకరకాల హావ భావ విన్యాసాలతో ప్రెస్ మీట్ ను ఏకపాత్రాభినయంలాగా రక్తి కట్టిస్తారు. ఆయనే మాజీ మంత్రి అంబటి రాంబాబు!
మామూలు సందర్భాలలోనే ఈ స్థాయిలో తన రాజకీయ మైలేజీ కోసం విచ్చలవిడిగా ప్రతి అవకాశాన్ని వాడుకునే అంబటి రాంబాబు.. పార్టీ పిలుపు ఇచ్చిన ఒక కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భాన్ని అంత తేలిగ్గా చేజార్చుకుంటారా.. అందుకే మరింతగా రెచ్చిపోయారు! ఈసారి కేవలం విలేకరుల మీద కాదు.. ఏకంగా పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దౌర్జన్యం చేశారు. పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇస్తే కలెక్టరేట్ ను ముట్టడించడం మాత్రమే కాకుండా.. కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతి లేకుండా దూసుకెళ్లడానికి ప్రయత్నించిన, అనుమతి లేని మార్గాల్లో ర్యాలీకి పూనుకున్న ఈ మాజీ మంత్రి అలా కుదరదని నచ్చజెప్పబోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ను నానా దుర్భాషలాడడం గమనార్హం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా పిలుపు ఇచ్చిన అధినాయకుడు అసలు రాష్ట్రంలోనే ఉండకుండా బెంగళూరు ప్యాలెస్ కు పారిపోయినప్పటికీ చెదురు ముదురుగా అక్కడా ఇక్కడా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని తమకు తోచిన విధంగా నిర్వహించారు. అలాగే గుంటూరు సిద్ధార్థ నగర్ లోని తన నివాసం నుంచి అంబటి రాంబాబు అనుచరులతో కలిసి మోటార్ సైకిల్ ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో మరొకవైపు ర్యాలీగా వెళ్లారు. ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇంత మందిని వెళ్ళనిచ్చేది లేదని పోలీసులు ఆంక్షలు విధించేసరికి ఆయన రెచ్చిపోయారు. ఈ రూట్ లు ఏవీ కూడా ఆయన ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నవి కాకపోవడం గమనార్హం.
కాగా సిఐ మీద రాయడానికి వీలు లేని అసభ్య భాషలో రెచ్చిపోతూ ఏం చేస్తావంటూ నానా దుర్భాషలాడారు. మర్యాదగా మాట్లాడాలని నోరు అదుపులో పెట్టుకోవాలని సిఐ అన్నందుకు అంబటి రాంబాబు మరింతగా రెచ్చిపోయారు. పళ్ళు కొరుకుతూ నాలుక మడత పెట్టేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు.. పళ్ళు కొరుకుతున్నారేంటి అంటూ సమాధానం చెప్పారు.
జగనన్న కళ్ళలో ఆనందం చూడడానికి అడ్డగోలుగా పోలీసుల మీద రెచ్చిపోవడం ఒక్కటే దగ్గర దారి అని అంబటి రాంబాబు ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది. పోలీసుల మీద ఎంతగా విమర్శలు చేసే వాతావరణం ఉంటే అంతగా తమకు మంచి పేరు వస్తుందని వారు అనుకుంటున్నారేమో తెలియదు. వారే రాద్ధాంతం చేయడం.. రచ్చ చేయడం.. వివాదాలను సృష్టించడం.. దౌర్జన్యాలు చేయడం.. అన్నీ చేసిన తర్వాత తమకేదో అన్యాయం జరిగిపోయినట్లుగా ఆక్రోశం వ్యక్తం చేయడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరిపాటిగా మారింది. అంబటి రాంబాబు అలాంటి కుటిలనీతిని రెండాకులు ఎక్కువే చదివారని ఈ సంఘటన గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి దుందుడుకు చర్యల వలన పార్టీ పరువు మరింతగా పోవడమే తప్ప వచ్చే లాభం ఉండదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.