అమెరికన్ ఈవీ దిగ్గజం టెస్లా భారత్ లో ఫ్యాక్టరీ పెట్టేందుకు రెడీ అయ్యింది. కానీ ఇంకా ఎక్కడ పెట్టాలని డిసైడ్ చేయలేదు. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈవీ లగ్జరీ కార్ల దిగుమతలపై కాస్త పన్నులు తగ్గించడంతో ఇంపోర్టెడ్ అమ్మనున్నట్లు తెలుస్తుంది. జర్మనీ ప్లాంట్ నుంచి ఇండియాకు తీసుకు వచ్చి అమ్ముతారని సమాచారం. అయితే వీలైనంత త్వరగా ప్లాంట్ పెట్టాలని మస్క్ అనుకుంటున్నారు. అందుకే టెస్లాకు చెందిన బృందం ఇప్పుడు ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలని లొకేషన్ వేటలో ఉంది.
ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్లాంట్ పెడితే పన్నుల పరంగా చాలా ప్రయోజనాలు కలసి వస్తాయి. అందుకే మస్క్ సిద్ధంగా ఉన్నారు. నిజానికి మస్క్ ఇండియాలో ప్లాంట్ పెట్టడం అమెరికా పెద్దన్న ట్రంప్ కు కూడా ఇష్టం లేనట్లు తెలుస్తుంది. కానీ మస్క్ వ్యాపారం మస్క్ ది. అందుకే ఆయన ఇండియాలో ప్లాంట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఆ ప్లాంట్ తమ రాష్ట్రానికి రావాలంటే.. తమ రాష్ట్రానికే రావాలని చాలా రాష్ట్రాల పెద్దలు ప్రయత్నిస్తున్నారు. టెస్లా ప్రధానంగా పహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తోందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తిరస్కరించలేనంత ఆఫర్లు ఇచ్చి అయినా ప్లాంట్ ను తెప్పించుకోవాలని గట్టి ప్రయత్నం మీద ఉన్నాయి.
అయితే ఈ విషయంలో తెలంగాణకు ప్రత్యేక అడ్వాంటేజ్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆకర్షణీయమైన ఈవీ పాలసీని ప్రకటించింది. పారిశ్రామికంగా అనుకూలంగా ఉండే ప్రాంతం అయితే పోర్టు లేకపోవడం మైనస్. ఏపీ పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కియా లాంటి భారీ కార్ల తయారీ ఫ్యాక్టరీ ఎలాంటి సమస్యలు లేకుండా రన్ అవుతోంది. అలాగే పోర్టులు అడ్వాంటేజ్. కావాల్సినంత భూమి తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించి అయినా టెస్లాను ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అడిగిన చోట భూమిని ఇవ్వడంతో పాటు పోర్టు లింకేజీ కల్పించేందుకు సిద్దమని ఏపీ ప్రభుత్వం నుంచి సంకేతాలు వెళ్లినట్లుగా టాక్ నడుస్తుంది.
ఏపీ ప్రభుత్వ పెద్దలు మొదటి నుంచి టెస్లాలో ఉన్నత స్థానాల్లో ఉన్న తెలుగువారి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. అసలు ప్రయత్నించకుండా.. ఉండటం కన్నా .. ప్రయత్నిస్తే వచ్చేది వస్తుంది కదా అన్నట్లుగా ఓ రాయి విసురుతున్నారు. పారిశ్రామిక రాయితీలు ఇచ్చి.. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా చేస్తే దీర్ఘకాలంలో ఏపీ ఆటోమోబైల్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కియా కార్లు దేశవ్యాప్తంగా తిరుగుతున్నాయి. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. అయితే టెస్లాను తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని ఇలా మంది సీఎంలు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. మరి ఆ రేసులో ఎంత ముందుకు వెళ్తుందన్నది కీలకంగా మారింది.