సిగ్గు సిగ్గు : ఈ గూండాలేనా జగన్ తమ్ముళ్లు!

‘మేమంతా సిద్ధం’ అంటూ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభల్లో సుదీర్థమైన ఆయన ప్రసంగం పూర్తయ్యే సమయంలో స్థానిక అభ్యర్థి ఎవరు పక్కకు వచ్చి నిలబడినా.. జగన్ చెప్పే మాట ఒక్కటే.. ‘‘నా తమ్ముడు.. మంచివాడు.. సౌమ్యుడు..’’ అంటూ ఊదరగొట్టేస్తారు. ‘తమ్ముడు, మంచివాడు, సౌమ్యుడు’ అనే మూడు పదాలు తప్ప తన అభ్యర్థుల గురించి జగన్ కు మరొక్కమాట తెలియకపోవడం ఏపీ ప్రజల ఖర్మం. అదే సమయంలో.. ఆయన అభ్యర్థులు ఎంతటి సౌమ్యులో, వారి గురించి జగన్ చెబుతున్నవి ఎంతెంత అబద్ధాల్లో.. పోలింగ్ సందర్భంగా చాలా స్పష్టంగా కనిపించింది. నిన్నటిదాకా ప్రచారంలో భాగంగా.. ఓటర్ల కాళ్లు పట్టుకుని బతిమాలిన అభ్యర్థులు ఇవాళ పోలింగ్ నాడు అసహనానికి గురై ఓటరు మీదనే చేయి చేసుకుని చెంపదెబ్బ కొట్టడం తెనాలి నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఒక పోలింగ్ బూత్ లో అకారణంగా ఓటరు మీద చేయిచేసుకున్నారు.. ఓటరు కూడా అదే రీతిలో స్పందించినందుకు.. ఎమ్మెల్యే తరఫు గూండాలు ఆ ఓటరును చితక్కొట్టారు. ఇదంతా పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తుండగానే జరగడం విశేషం.
తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. తెలుగుదేశం జనసేన కలిసి పోటీచేస్తుండడంతో.. తెనాలి నియోజకవర్గంలో జనసేనఅభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు గెలుపు సునాయాసం అవుతుందనే సానుకూల వాతావరణం ఏర్పడింది. పరిస్థితిముందే అర్థమైపోయేలా సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే శివకుమార్ ఓటు వేయడానికి బూత్ వద్దకు వెళ్లారు. అయితే క్యూలైన్లో కాకుండా ఆయన నేరుగా ఓటు వేసేందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. క్యూలైన్లోని ఒక ఓటరు ఎమ్మెల్యేను కూడా లైన్లో రమ్మని చెప్పడంతో.. ఆయనకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఓటరు మీదికి దూసుకెళ్లి చెంప చెళ్లుమనిపించారు. దాంతో ఓటరు కూడా ఊరుకోకుండా ఎమ్మెల్యేను తిరిగి చెంపదెబ్బ కొట్టారు. అంతే.. ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులైన గూండాలు ఆ ఓటరు మీద విరుచుకుపడి చితక్కొట్టేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్లంతా నిర్ఘాంతపోయారు. ఎమ్మెల్యే స్వయంగా ఓటరు మీద దాడిచేయడం.. అనుచరులతో కొట్టించడం వారు జీర్ణించుకోలేకపోయారు. ఈ దారుణం మొత్తం.. పోలీసుల సమక్షంలోనే జరగడం గమనించాల్సిన సంగతి.

Related Posts

Comments

spot_img

Recent Stories