జగన్మోహన్ రెడ్డి దళాలకు ఇప్పుడు నోర్లు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువచ్చినప్పటికీ.. సూపర్ సిక్స్ పథకాలు చాలా ఇంకా అమలుకాలేదంటూ.. విషప్రచారం సాగిస్తూ వచ్చారు. అలాంటిది.. ఆ సూపర్ సిక్స్ లో అత్యంత కీలకమైన తల్లికి వందనం అనే హామీ ఇవాళ కార్యరూపం దాలుస్తోంది. ఇందులో ఎలాంటి శషబిషలు లేవు. ఎలాంటి విమర్శలకు కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే.. తల్లికి వందనం హామీ గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ.. 2025 విద్యాసంవత్సరం మొదలయ్యేలోగా.. తల్లుల ఖాతాల్లో నిధులు వేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు. ఆ మేరకు ప్రభుత్వం ఇవాళ మాట నిలబెట్టుకుంటున్నది. జూన్ 12న విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్న సమయంలో ఇదేరోజున తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నది.
ఈ పథకం ద్వారా ఒకటినుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15వేల సాయం అందుతుంది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తించేలా ఈ పథకాన్ని అమలుచేయబోతున్నట్టుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని చంద్రబాబు సర్కారు నిలబెట్టుకుంటోంది. గతంలో జగన్ హయాంలో ఇలాంటి హామీనే ఇచ్చినప్పటికీ.. అమలులోకి వచ్చేసరికి ఒక ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే లెక్కవేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుండేది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి ఒనగూరేలా.. వారి తల్లులఖాతాల్లో రూ.8745 కోట్లను గురువారం ప్రభుత్వం జమ చేయనుంది.
కూటమి ప్రభుత్వానికి సంబంధించి సూపర్ సిక్స్ మాత్రమే పథకాలు కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు కాదు. తమ మేనిఫెస్టో రూపంలో తెలుగుదేశం ప్రజలకు అనేక హామీలను ఇచ్చింది. వాటిలో ఇప్పటికే అనేకం అమలు అయ్యాయి. సంక్షేమ పింఛన్లను రూ.4వేలకు పెంచడం దగ్గరినుంచి, మెగా డీఎస్సీ ప్రకటన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మత్స్యకారులకు క్రాప్ హాలిడే రోజుల్లో నెలకు రూ.20 వేల చెల్లింపు, పి4 కార్యక్రమం అమలు, 8లక్షల దాకా పారిశ్రామిక ఉద్యోగావకాశాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ విషం కక్కే జగన్ దళాలకు కనిపించడం లేదు. సూపర్ సిక్స్ గురించే వారు ఎక్కువగా గొడవ చేస్తున్నారు. వాటి విషయానికి వస్తే వాటిలో అమలైనది ఇప్పటికి దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం మాత్రమే. అయితే ఇప్పుడు తల్లికి వందనం అమలు కాబోతోంది. ఇదే నెలలో రైతులకు ఏడాదికి రూ.20వేలు అందించే రైతుభరోసా పథకం అమలవుతుందని చంద్రబాబు ప్రకటించారు. ఆగస్టు 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం మహిళలకు దక్కుతుంది. అప్పటికి నాలుగు సూపర్ సిక్స్ హామీలు పూర్తయినట్టు లెక్క. అంటే విమర్శించడానికి విపక్షానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుండగా.. కొత్తగా ఎలా విషం చిమ్మాలా అనే కుటిల మార్గాల అన్వేషణలో వైసీపీ ఉండడం విశేషం.