రేబిస్ వస్తుంది.. పిచ్చికుక్కతో పోల్చిన నాగబాబు!

ఎన్నికల ప్రచారం ఒక కొలిక్కవస్తున్న సమయంలో.. జనసేన నాయకుడు, పార్టీ తరఫున కూటమి వ్యూహాత్మక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నాగబాబు.. ఒక ప్రచార వీడియోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక ప్రభుత్వం మళ్లీ ఏర్పడకుండా ఓడించాల్సిన ఆవశ్యకత గురించి ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఒక్క చాన్స్  ఇచ్చినందుకే .. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని, మరోసారి అవకాశం ఇస్తే నాశనం చేయడానికి కూడా ఇక్కడ ఇంకేం మిగలదని నాగబాబు ప్రజలను హెచ్చరించారు.

పారిశ్రామికంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల దుర్మార్గాలు రాష్ట్రాన్ని ఏ రకంగా వెనుకబాటుతనంలోకి తీసుకువెళ్లాయో నాగబాబు తన వీడియోలో వివరించారు. అమరరాజాసంస్థ అధినేత గల్లా జయదేవ్ తమ ఫ్యాక్టరీ రెండో యూనిట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం వేధించిన వైనం గుర్తు చేశారు. ఇక్కడ వేధింపులకు జడిసి, ఎంపీగా ఉన్న జయదేవ్ కూడా ఏమీ చేయలేక పొరుగున ఉన్న తెలంగాణలో ప్రాజెక్టు ఏర్పాటుచేశారని, అక్కడ కొన్ని వందల మందికి ఉద్యోగావకాశాలు దక్కాయని పేర్కొన్నారు. చంద్రబాబు తీసుకువచ్చిన కియా పరిశ్రమ కూడా వైసీపీ సర్కారు వేధింపులు తట్టుకోలేక తమ రెండో యూనిట్ ను బెంగుళూరులో ఏర్పాటు చేసుకున్నదాని చెప్పారు.

ప్రత్యేకించి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నాగబాబు, రేబిస్ వ్యాధి వచ్చిన పిచ్చి కుక్కతో పోల్చడం విశేషం. రేబిస్ వచ్చిన పిచ్చికుక్కలు ఉన్న చోట బివేర్ ఆఫ్ రేబిస్ అని, బివేర్ ఆఫ్ డాగ్ అని హెచ్చరిక బోర్డులు రాసి ఉంచుతారని అంటూ.. అలాగే ప్రజలందరినీ కూడా బివేర్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ అని హెచ్చరిస్తున్నానంటూ నాగబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని పిచ్చికుక్కతో పోల్చడం, ఆ పరిపాలనను అసహ్యించుకుంటున్న వారికి ఆసక్తికరంగా కనిపిస్తోంది.

నిజాయితీకి త్యాగనిరతికి మారుపేరైన పవన్ కల్యాణ్ , పరిపాలన దక్షతకు మారుపేరైన చంద్రబాబునాయుడు, దేశాన్ని ఎన్నో రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నరేంద్రమోడీలు రాష్ట్రం కలసికట్టుగా కూటమిగా ముందుకు వచ్చారని ఆ కూటమిని ప్రజలు గెలిపించాలని నాగబాబు కోరారు.

Related Posts

Comments

spot_img

Recent Stories