జగన్‌కు కూడా పురందేశ్వరి నోటీసులు!

విశాఖలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ దందాతో తన పేరును ముడిపెట్టి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న వారిమీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథి దగ్గుబాటి పురందేశ్వరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో సాక్షి దినపత్రికపై 20 కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేయబోతున్నట్లుగా ఆమె ఆ సంస్థకు నోటీసులు పంపారు. సంస్థ నుంచి సరైన వివరణ రాకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. అయితే తాజాగా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే.. పురందేశ్వరి ముఖ్యమంత్రి జగన్ మీద కూడా పరువునష్టం దావా వేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి.. ముఖ్యమంత్రి ప్రసంగం వీడియోలను కూడా కలిపి..

ఆయన కు కూడా పరువునష్టం దావా నోటీసులు సర్వ్ చేయడానికి ఆమె న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

సాక్షి ఒక పత్రికా సంస్థగా వారు ప్రచురించే వార్తాకథనాల మీద ఇలాంటి పరువునష్టం నోటీసులు అనేకం వస్తుంటాయి. ఇలాంటి నోటీసులను ఎదుర్కొటూ నిత్యం కోర్టులో వాదులాడుతూ ఉండడానికి, నోటీసులకు రిప్లయి ఇవ్వడానికి బోలెడు మంది లాయర్లు ఉంటారు. ఇలాంటివి అనేకం వారు రోజూ చూస్తుంటారు. కానీ ఏకంగా ముఖ్యమంత్రికే పరువు నష్టం నోటీసులు సర్వ్ చేయడం అనేది అరుదుగా జరిగే సంగతి. ఇంతకూ పురందేశ్వరికి అంత కోపం తెప్పించేలా జగన్ ఏం అన్నారు?

ఆయన బుధవారం బస్సుయాత్ర ప్రారంభించిన తర్వాత ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో డ్రగ్స్ కంటైనర్ ప్రస్తావన కూడా తెచ్చారు. తనకు ఆవిషయం మాట్లాడడం ఇష్టం లేదు గానీ.. పత్రికల్లో వస్తున్నది గనుక.. ఆ సంగతి చెబుతానని అన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి బంధువులదే ఆ కంపెనీ అంటూ వారే డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటిదాకా వస్తున్న సమాచారాన్ని బట్టి, దగ్గుబాటి పురందేశ్వరి వియ్యంకులకు కొన్ని ఏళ్ల కిందట, సంధ్యా ఆక్వా యజమానితో వేరే మరొక వ్యాపారంలో భాగస్వామ్యం ఉండేది. ఆ తరువాత కొన్నాళ్లకు భాగస్వాములు విడిపోయారు. అంతే తప్ప.. పురందేశ్వరికి సంధ్యా ఆక్వా యజమానితో బంధుత్వం ఉన్నదనేది పూర్తిగా సత్యదూరం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవం ఇలా ఉండగా.. జగన్ తన నోటికొచ్చినట్టుగా పురందేశ్వరికి డైరక్టుగా డ్రగ్స్ దందాతో లింకులున్నట్టుగా, ఆమె బంధువులే చేయిస్తున్నారని ఆరోపించడంపై ఆమె సీరియస్ అయినట్టు సమాచారం. అందుకే జగన్ కు నేరుగా పరువు నష్టం నోటీసులు సర్వ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories