మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ తాజాగా తన అభిమానుల కోసం ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ఆ విషయం తాను అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు.
త్వరలోనే అభిమానుల కోసం ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని.. అభిమానులందరినీ తాను ప్రత్యేకంగా కలుసుకుంటానని తారక్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తారక్ అన్నారు.
ఇలాంటి పెద్ద సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని.. కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని తారక్ కోరుతున్నట్లు ఆయన ఆఫీస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని.. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రాధాన్యత అని తారక్ తేల్చి చెప్పారు. ఇలా అభిమానుల కోసం ఎన్టీఆర్ స్పెషల్ ప్లాన్ చేస్తుండటంతో ఆయన్ను కలిసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.