అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో భక్తులు దైవసమానంగా భావించే మహాప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించేందుకు కల్తీనెయ్యిని సరఫరా చేసిన పాపంలో.. కొత్త కోణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆలయాల పాలకమండలులతో కుమ్మక్కు అయి.. జంతువుల కొవ్వు, బయో వ్యర్థాలతో తయారుచేసిన నకిలీ, కల్తీ నెయ్యిని ఆలయాలకు అంటగట్టిన వ్యవహారం ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. తిరుమల ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసును సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పరిశోధిస్తున్న సంగతి తెలిసిందే. వీరి దర్యాప్తులో ఇంకా అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి మాత్రమే కాదు. విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి, శ్రీశైలం శ్రీకాళహస్తిలలోని శివాలయాలకు, కాణిపాకంలోని వినాయకుడి ఆలయానికి, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు కూడా ఇదే కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టుగా తేలుతోంది.
ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఒక చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని ఈ దందా మొత్తం నడిపించినట్టుగా వివరాలు బయటకు వస్తున్నాయి.
తిరుపతిలోని ఒక డెయిరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే భోలేబాబా డెయిరీ నుంచి కల్తీ నెయ్యిని సరఫరాచేసినట్టుగా విచారణాధికారులు తేల్చారు. భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ బెయిలు పిటిషన్ విచారణ సందర్బంగా ఈ సంగతులన్నీ వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఈ సమస్త అక్రమాలకు మాస్టర్ మైండ్ అని, ఆయన బెయిలుపై బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారని ఏపీపీ వాదించారు. బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైంది కూడా.
భోలేబాబా డెయిరీ.. ఆలయాలకు నెయ్యి సరఫరా చేసిన విషయంలో పాల్పడిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు అని తేలుతోంది. 2022లో భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత మాల్ గంగ అనే డెయిరీ తెరపైకి వచ్చింది. వీరికి కమిషన్లు చెల్లిస్తూ సుగంధ ఆయిల్స్, పామోలిన్ తదితర పదార్థఆలతో తయారుచేసిన కల్తీనెయ్యిని భోలేబాబా డెయిరీనే తయారుచేయించి.. టీటీడీకి మాల్ గంగ ద్వారా సరఫరాచేసింది. ఈ దందాలో ట్విస్టు ఏంటంటే.. తిరుపతి లోని స్థానిక డెయిరీని అడ్డు పెట్టుకుని.. దందా సాగించారు. వారికి సరిపడా నెయ్యి ఉత్పత్తి చేయగల సామర్థ్యం లేదని తెలిసినప్పటికీ కూడా.. టీటీడీ కాంట్రాక్టు అప్పగించింది. ఆ ముసుగులో విచ్చలవిడిగా కల్తీ నెయ్యిని పంపుతూ వచ్చారు. భోలేబాబా డెయిరీ ఈ ఆలయాలన్నింటికీ సరఫరా అయిన కల్తీ నెయ్యి వెనుక కీలక పాత్ర అని అర్థమవుతోంది. అయితే.. వారికి అండగా ఉండి.. టీటీడీకి కూడా అదే కల్తీ నెయ్యి రావడానికి కారకులైన రాజకీయ పెద్దలెవ్వరు.. ఈ దందాల్లో వారి వాటా ఎంత? అనేది సిట్ తేల్చవలసి ఉంది.