‘మా కుటుంబం మీ అమ్మాయి అక్రమరవాణా, డ్రగ్స్ విక్రయం కేసులు తప్ప అన్ని రకాల కేసులు పెట్టారు. ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు.. ఎన్ని కేసులు పెట్టినా వారు మమ్మల్ని ఏమీ చేయలేరు..’ అని కొన్ని రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన సవాళ్లు పాఠకులకు గుర్తుండే ఉంటాయి. కానీ.. ఇలాంటి సవాళ్లు ఏదో ఆ సమయానికి మీడియా ముందు గంభీరంగా కనిపించడానికి ఆయనకు ఉపయోగపడవచ్చునేమో గానీ.. చేసిన నేరాల నుంచి పూర్తిగా ఆయనను దూరం చేయలేవు అని పరిస్థితులు నిరూపిస్తున్నాయి. భూఆక్రమణలు, అటవీ భూముల కబ్జాలకు సంబంధించి పెద్దరెడ్డి కుటుంబం పాల్పడిన అక్రమాల కేసులు కూడా ఒకవైపు కొలిక్కి వస్తుండగా.. దేశాన్ని కుదిపివేస్తున్న అతిపెద్ద లిక్కర్ కుంభకోణం లో కూడా అసలు సిసలు కీలకపాత్ర పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదే అని ఇప్పుడు తేలుతోంది. ఈ మేరకు సీఐడీ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైఎస్ జగన్ అండ్ కో కాజేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణం విషయంలో.. ఆ సర్కారు అమలు చేసిన కొత్త లిక్కర్ విధానానికి రూపకల్పన దగ్గరినుంచి అమలుకు నేతృత్వం వహించడం వరకు కీలక పాత్ర మొత్తం ఆయనదే అని తెలుస్తున్నదని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మద్యం కంపెనీల నుంచి ముడుపులుగా స్వీకరించిన సొమ్ములను అనేక షెల్ కంపెనీల్లోకి వాటినుంచి వైసీపీ పెద్దలకు అందేలా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్టుగా ఇప్పటికే తేలిన సంగతి అందిరికీ గుర్తుండే ఉంటుంది. మద్యం స్కామ్ లో ఏ16 నిందితులుగా ఉన్న డికార్ట్ లాజిస్టిక్ కంపెనీ ద్వారా మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీ బ్యాంకు ఖాతాకు రూ.5 కోట్ల రూపాయలు జమ అయినట్టు పోలీసులు గుర్తించిన సంగతి లూథ్రా వివరించారు.
పీఎల్ఆర్ సంస్థలో వంద శాతం షేర్లు పెద్దిరెడ్డి కుటుంబానివేనంటూ.. ఆ సంస్థతో తమకు సంబంధం లేదని మిధున్ రెడ్డి చెప్పడం తమాషాగా ఉందని అంటున్నారు. ఇక్కడ అన్నింటికంటె పెద్ద ట్విస్టు ఏంటంటే.. లిక్కర్ స్కామ్ బాగోతాలు, డికార్ట్ నుంచి అందిన ముడుపుల వ్యవహారం బయటకు వచ్చిన తరవాత పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ నుంచి 5 కోట్ల రూపాయలను తిరిగి డికార్ట్ లాజిస్టిక్స్ కు వెనక్కు పంపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. తీసుకోవడం ఒక నేరం అయితే.. అది బయటపడగానే, వెనక్కు పంపడం ద్వారా ఆ నేరాన్ని కప్పెట్టుకునే మరో నేరం చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలనే మిథున్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా.. అసలు ఈ కేసులో ఆయన పాత్ర ఎంత లోతుగా, కీలకంగా ఉన్నదో సీఐడీ న్యాయవాదులు మొత్తంగా బయటపెడుతున్నారు. మొత్తం స్కామ్ కు సూత్రధారిగా నడిపించిన వ్యక్తుల్లో ఒకరైన మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉన్నదని.. ఆయనకు బెయిలు ఇవ్వరాదని సీఐడీ వాదిస్తోంది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.