కూల్చివేతల్ని తమరు కూడా రుచిచూడండి జగన్!

అధికారంలోకి వచ్చిన తొలినాడే ప్రజావేదిక అనే ప్రభుత్వ ఆస్తిని కూల్చేసి పరిపాలన ప్రారంభించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమ పరిపాలన సాగినంత కాలం తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఆస్తుల మీద ఏ రకంగా విరుచుకుపడ్డారో అందరూ గమనించారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ, ఆక్రమించారు అంటూ.. సరైన కారణాలు కూడా చూపించకుండానే..  హఠాత్తుగా తెలుగుదేశం నాయకుల నివాస భవనాల మీదికి జెసిబిలతో విరుచుకుపడడం.. ఒక్కసారిగా వాటిని కూల్చేయడం ఒక వినోద కార్యక్రమంలాగా పెట్టుకున్నారు. తెదేపా నాయకుల భవనాల్ని కూల్చివేస్తూ ఉంటే.. ఆ వీడియోలు చూసి ఆనందం పొందారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం పదవి నుంచి దిగిపోయినంత మాత్రాన కూల్చివేతల్ని చూడడంలో పొందే ఆనందాన్ని ఆయనకు దూరం చేస్తే ఎలా? అని తెలుగుదేశం ఫిక్స్ అయినట్టుంది. అందుకే… నిబంధనలకు విరుద్ధంగా, అసలు అనుమతులే తీసుకోకుండా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ఆయన ప్రభుత్వం అడ్డగోలుగా కూల్చివేయిస్తోంది. అమరావతి పరిధిలో సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం అనేది కేవలం బిగినింగ్ మాత్రమే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదే సమయంలో.. విశాఖపట్టణంలో దాదాపుగా నిర్మాణం పూర్తి కావచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనానికి గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు. అనుమతులు లేకుండా ఆఫీసు నిర్మిస్తున్నారంటూ.. ఈ భవనాలను ఎందుకు కూల్చవేయకూడదో సంజాయిషీ తెలియజేయాలంటూ నోటీసులు ఆఫీసు గోడలకు అంటంచారు. అయితే దూకుడుగా స్పందించడానికి మారుపేరైన వైసీపీ నాయకులు.. గుడివాడ అమర్నాధ్ ఆధ్వర్యంలో అక్కడకు వచ్చి అధికారులు ఇచ్చిన నోటీసులను చించేశారు.
అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆదివారం తెల్లవారుజామునుంచే అనుమతుల్లేకుండా నిర్మించిన విశాఖ వైసీపీ కార్యాలయం కూల్చివేత మొదలవుతుందని తెలుస్తోంది.

కూల్చివేతలను చూసి ఆనందించడంలోని మజాను జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణంగా అందించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ అధికారంలో ఉండగా.. ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలకోసం అనే ముసుగులో ప్రభుత్వ ఆస్తులను లీజుకు తీసుకున్న వైసీపీ, అనుమతులు లేకుండానే నిర్మాణాలు ప్రారంభించింది. ప్రభుత్వం తమదే అయినా కనీసం అనుమతులు తీసుకోవాలని కూడా పట్టించుకోకుండా.. యథేచ్ఛగా సాగించిన నిర్మాణాలను చంద్రబాబు సర్కారు ఇప్పుడు నేలమట్టం చేస్తోంది.
ఒకవైపు జగన్ చంద్రబాబు విధ్వంసక పాలన చేస్తున్నారంటూ ఎక్స్ ఖాతాలో విలపిస్తున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ  కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ  తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను.’’

తాను పరిపాలన సాగించినంత కాలమూ.. కక్షసాధింపు అనే దుర్మార్గాలను పీక్స్ కు తీసుకువెళ్లిన జగన్ ఇప్పుడు ఇలా ట్వీట్లలో బేలగా విలపిస్తుండడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories