కుప్పం ఘటన: జగన్- చంద్రబాబు మధ్య తేడా అదే!

కుప్పంలో రెండు కుటుంబాల మధ్య 80వేల రూపాయల అప్పుకు సంబంధించిన తగాదా ఉంది. అప్పు తీసుకున్న వ్యక్తి పరారైపోయాడు. అతని భార్య ముగ్గురు పిల్లల సహా బెంగుళూరుకు వలస వెళ్లి కూలీనాలీ చేసుకుంటూ బతుకుతోంది. కొడుకు టీసీ తీసుకువెళ్లి బెంగుళూరులోనే చదివించుకోవడానికి ఆమె కుప్పం వచ్చింది. అప్పు ఇచ్చిన వాళ్లు ఊరుకోలేదు. ఆమెను నిలదీసి నిర్బంధించారు. పసివాడైన కొడుకు  ఎదుటే ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. తర్వాత విడిచిపెట్టారు. అలా ఆమెను కొట్టిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ నీలిదళాలు విపరీతమైన దుష్ప్రచారం ప్రారంభించాయి. తన సొంత నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే.. ఒక మహిళను చెట్టుకు కట్టేయించి, కొట్టించిన స్థాయిలో వారి ప్రచారం సాగింది.

ఇక్కడ కొన్ని విషయాలను గమనించాల్సి ఉంది. ఈ ఘటన చాలా దుర్మార్గమైనది. అప్పు తీర్చలేకపోయి ఉండవచ్చు గాక.. కానీ ఒక మహిళ పట్ల అంతటి అమానుషంగా ప్రవర్తించడం అనేది ఊహించలేం. వైసీపీ చేసిన ఆరోపణల సంగతి పక్కన పెడితే.. ప్రభుత్వం ఈ దుర్మార్గం విషయంలో చాలా సీరియస్ గా స్పందించింది. బాధిత మహిళతో రాష్ట్ర హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వీడియోకాల్ లో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ స్థానిక పోలీసుల్ని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదలిపెట్టేది లేదని కూడా చంద్రబాబునాయుడు ప్రకటించారు. పోలీసులు కూడా హుటాహుటిన రంగంలోకి దిగారు. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడిచేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసి కుప్పం కోర్టులో హాజరు పరిచారు. వారిని మదనపల్లె జైలుకు తరలించారు.
విషయం ఏంటంటే.. ఈ ఘటనలో రాజకీయ ఆరోపణలు చేయడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే.. అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అప్పుకు సంబంధించిన తగాదా. అప్పు ఇచ్చిన వ్యక్తి తెలుగుదేశం అంటూ ముద్ర వేయడానికి నీలిదళాలు, సాక్షి మీడియా విఫలయత్నం చేశాయి. వారి నిందల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోయింది. నిందితులను తక్షణమే జైలుకు పంపారు. తమ సొంత పార్టీ వారనే ఆరోపణలు వచ్చినా కూడా వాటిని ఖాతరు చేయకుండా.. చట్టప్రకారం శిక్షలు అమలు చేయించారు సీఎం చంద్రబాబు. పైగా బాధిత మహిళకు రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించి ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు.

ఇదే సమయంలో.. ఒక పాత సంఘటనను గుర్తుచేసుకుంటే ఇలాంటి సందర్భాల్లో జగన్ బుద్ధి ఏమిటో  మనకు అర్థమవుతుంది. జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకడు.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు, తన సొంత డ్రైవరు దళితయువకుడు అయిన సుబ్రమణ్యం ను చంపేశాడు. ఆ శవాన్ని అతని ఇంటి వద్దకు తాను స్వయంగా డోర్ డెలివరీ ఇచ్చాడు. జగన్ పాలన కాలంలో.. ఈ దుర్మార్గంచూసి రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. ఆ సందర్భంలో జగన్ ఏం చేశారు? తన పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ దళితుడిని హత్యచేసి, డోర్ డెలివరీ చేస్తే ఎలా స్పందించారు? ఆ విషయం గుర్తు చేసుకుంటే చాలు.. జగన్ కు, చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. అనంతబాబు బెయిలుమీద విడుదల అయితే క్రేన్ లతో గజమాలలు వేయించి ఊరేగించారు. అలాంటి నీచులను ఎంకరేజ్ చేసే పార్టీ ఇప్పుడు కుప్పంలోని సాధారణ  ఘటన విషయంలో రాజకీయ రంగులు పులిమి.. అనైతికంగా చవకబారుగా వ్యవహరించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories