జగన్ పాలన మరో ఎమర్జెన్సీనే! రీజన్ చెప్పిన చంద్రబాబు!

భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి అత్యంత కర్కశంగా ప్రజల గొంతుకలను అణిచివేసిన దుర్మార్గమైన ఎపిసోడ్ గురించి ప్రజలకు తెలుసు.  ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత దుర్దినంగా కేంద్ర ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది. అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ముసుగులో ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే.. సంవిధాన్ హత్యా దివస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబునాయుడు ఒక కొత్త పోలికను కూడా తెలుగు ప్రజలకు తెలియజెప్పారు. అయిదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ కంటె కూడా దుర్మార్గమైన విషయం అని ఆయన అభివర్ణిస్తున్నారు.
ఇందిరాగాంధీ సర్కారు అప్పట్లో ఎమర్జెన్సీ విధించి.. యాభయ్యేళ్లు పూర్తయ్యాయి.  అరాచక అప్రాజాస్వామిక నిర్ణయం ప్రజాస్వామ్యానికి మానని గాయంగా మిగిలిపోయిందని అందరూ అంటూ ఉంటారు. అయితే చంద్రబాబు కొత్తగా చెప్పిన పోలిక ఏంటంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సరిగ్గా ఇదే రోజున ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా.. తన పరిపాలన ప్రారంభించారు. ఆ చీకటిపర్వాన్ని గుర్తు చేసుకోవడానికి సంవిధాన్ హత్యా దివస్ నిర్వహిస్తున్నట్టుగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఒక్కచాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అప్పట్లో తాడేపల్లిలో ఇల్లు కట్టుకోవడం అనేది.. ఆయన కేవలం రాష్ట్రప్రజలకు వేసిన ఎర. చీటింగ్ టెక్నిక్. ఆ ఇల్లు నిర్మాణం ద్వారా.. తాను అమరావతికి మద్దతు ఇస్తున్నట్టెుగా.. అమరావతిలోనే రాజధానిని అభివృద్ధి చేయబోతున్నట్టుగా రంగు పులమడానికి జగన్ ప్రయత్నించారు. అలా ప్రజలను నమ్మించారు. కానీ.. ఆయన మనసులో ఉన్న దుర్బుద్ధులు వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎమర్జెన్సీ విధించిన ఇదే రోజున.. ఉండవిల్లిలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను అమానుషంగా కూలగొట్టించడం ద్వారా జగన్ పరిపాలన ప్రారంభమైంది. తన విధ్వంసం మార్కుగల పాలన అని ఆయన చాలా బాగా నిరూపించుకున్నారు. అయిదేళ్లలో అమరావతిని స్మశానంగా మార్చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నాయకుల ఇళ్లను కూడా కూలగొట్టించి విధ్వంసక పాలనను కొనసాగించారు. మూడురాజధానుల పేరుతో పెద్ద డ్రామా నడిపించారు. విశాఖలు రుషికొండను గొరిగించేసి.. విధ్వంసం కొనసాగించి.. తన నివాసం కోసం అయిదువందల కోట్ల ప్రభుత్వ ధనంతో భవనాలు కట్టించారు. ఈ దుర్మార్గాలన్నీ తట్టుకోలేక ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి దారుణంగా ఓడించారు. ఎమర్జన్సీ విధించిన రోజునే.. ప్రజావేదిక కూల్చడం ద్వారా.. జగన్ కూడా అంతే స్థాయిలో ‘సంవిధాన్ హత్యా’ చేశారని పోలికతెస్తూ చంద్రబాబు నాయుడు విమర్శులు కురిపించడం ఆసక్తికరం.

Related Posts

Comments

spot_img

Recent Stories