వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వెళ్లి గిట్టుబాట ధరల్లేక సతమతం అవుతున్న పొగాకు రైతులను పరామర్శించాలని అనుకున్నారు. అయితే ఆయన యాత్ర పరామర్శ యాత్రలాగా సాగలేదు. ప్రచార యాత్రలాగా సాగిపోయింది. చావుల్ని పరామర్శించడానికి వెళ్లినా కూడా.. సుదీర్ఘమైన యాత్రగా వందల సంఖ్యలో జనాన్ని పోగేసి.. వారితో ‘సీఎం సీఎం’ అని నినాదాలు చేయించుకుంటూ వెళ్లడం అలవాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. పొగాకురైతుల వద్దకు కూడా మూడు కిలోమీటర్ల మేర యాత్ర చేసుకుంటూ వెళ్లారు. నిజానికి ఆయన టైమింగ్ బాగాలేదని చెప్పాలి. ఒకవైపు రాష్ట్రంలోని మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ తన ఛానెల్లో డిబేట్ నడిపించడమే గాకుండా.. నిరసనలు తెలియజేయడం కూడా దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ, అలాంటి వారిని సంకరతెగగా పేర్కొంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఎపిసోడ్ మొత్తం హాట్ హాట్ గా ఉన్న సమయంలోనే ఆయన పొదిలియాత్ర కూడా పెట్టుకున్నారు. సహజంగానే అక్కడి మహిళలు జగన్ పట్ల తమ నిరసన తెలియజేయడానికి పూనుకున్నారు. అలాంటి వారి మీద జగన్ ఆర్భాటపు యాత్రలో పాల్గొన్న వైసీపీ గూండాలు, రాళ్లతోను చెప్పులతోను దాడిచేయడం ఇక్కడ గమనార్హం.
ఇంతకూ ఆ మహిళలు చేసిన నేరం ఏమిటి? వారు చాలా ప్రజాస్వామిక పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి పట్ల తమ నిరసనలు తెలియజేయడానికి పూనుకున్నారు. నల్ల బెలూన్లు ఎగరేసి, నల్ల బెలూన్లు పట్టుకుని జగన్ యాత్రలో ఆయనకు తమ అసంతృప్తి నిరసన తెలియజేయాలని అనుకున్నారు. అంతకు మించి వారు చేసిన నేరం ఇంకేమీ లేదు. ప్రతి వ్యవహారం కూడా ఫ్యూడల్ పద్ధతిలో ట్రీట్ చేయాలని తలపోసే.. దుర్మార్గపు ఫ్యాక్షనిస్టు భావజాలానికి ప్రతీక అయిన జగన్మోహన్ రెడ్డి.. ఈ నిరసన తెలియజేసే మహిళల మీదికి కూడా తన గూండాలను తైనాతీలను ఉసిగొల్పారు. వారు రెచ్చిపోయి రాళ్లు, చెప్పులు విసురుతూ నానా యాగీ చేశారు.
వైసీపీ గూండాలు చేసిన రాళ్ల దాడుల్లో కేవలం నిరసనలు తెలియజేస్తున్న మహిళలు మాత్రమే కాదు. పోలీసులు కూడా గాయపడ్డారు. హెలిప్యాడ్ నుంచి పొగాకు వేలం కేంద్రం వరకు జగన్ వాహనాల్లో రోడ్డు మార్గంలో వెళ్లిపోయి ఉంటే చాలా బాగుండేది. కానీ.. ప్రచారకాంక్ష ముదిరిన ఆయన జనాన్ని రోడ్డు పొడవునా పోగేయించి.. రోడ్డు షోగా తన వాహనాల కాన్వాయ్ తో అక్కడకు వెళ్లారు.
పొదిలిలో నిరసన తెలియజేసిన మహిళలు డిమాండ్ చేసినదంతా క్షమాపణ మాత్రమే. రాజధాని మహిళలను అంతలేసి అసభ్యపు మాటలు అనిపించిన తర్వాత.. సాక్షిమీడియా తరఫున భారతి గానీ, వైసీపీ తరఫున జగన్ గానీ ఇప్పటిదాకా సారీ చెప్పలేదు. వారిలో ఆ భావన కూడా లేదు. మహిళలను అవమానించినందుకు మురిసిపోయే ధోరణిలోనే వారున్నారు. అలాంటిది పొదిలిలో మహిళలు నిరసన తెలియజేస్తే వారిమీద చెప్పులతో రాళ్లతో దాడిచేయించారు. ఇది జగన్ లోని అసలు బుద్ధిని, మహిళల పట్ల ఆయనకుండే అసలు ఉద్దేశాలను తెలయజెబుతోందని ప్రజలు అంటున్నారు.