శుద్ధపూస చెవిరెడ్డి తప్పించుకోవడం చాలా కష్టం!

లిక్కర్ స్కామ్ లో తన పేరు వినిపించిన తొలినాటినుంచి.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఒకటే మాట చెబుతున్నారు. లిక్కర్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేనేలేదని.. అసలు తాను ఎన్నికల్లో లిక్కర్ పంచడం అనేది చేయనేలేదని చాటుకున్నారు. ఆ రకంగా తనను మించిన శుద్ధపూస మరొకరు లేరన్నట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చుకున్నారు. ప్రెస్మీట్లు పెట్టి ఎన్నికబుర్లు చెప్పుకున్నప్పటికీ.. సిట్ పోలీసులు మాత్రం చెవిరెడ్డిని అరెస్టు చేశారు. అప్పుడు కూడా ఆయన పెద్దస్థాయిలో రంకెలు వేస్తూ తనను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని.. క్లీన్ గా బయటకు వస్తానని ప్రతిజ్ఞలు చేశారు. కానీ ప్రస్తుత వాతావరణం గమనిస్తోంటే.. ఆయన బయటకు రావడం అనేది అంత ఈజీ కాదని అనిపిస్తోంది.

లిక్కర్ కుంభకోణంలో నగదు అక్రమ తరలింపుల్లో కీలక భూమిక పోషించిన విషయంలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి పాత్రను ఇప్పటికే పోలీసులు పలు ఆధారాల ద్వారా నిర్ధరించారు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెవిరెడ్డి కొట్టేస్తూ వచ్చారు. తాజాగా ప్రకృతి ఆయన పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒకవైపు లిక్కర్ కేసులో కీలక నిందితులుగా మారిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జులై 1 నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించారు.

అంతకంటె ప్రతికూలాంశం ఏమిటంటే.. భాస్కర రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తున్న కోర్టు కొట్టివేసింది. ఆయనకు ఇప్పటికే సిట్ పోలీసులు విచారణ నిమిత్తం నోటీసులు సర్వ్ చేయగా.. ఆయన డుమ్మా కొట్టి పరారీలో ఉంటూ బెయిలు పిటిషన్ నడిపారు. బెయిలు వస్తుందనే ధీమాతో.. విచారణకు రాలేదు. కానీ.. అది తిరస్కరణకు గురికావడంతో.. మోహిత్ రెడ్డి విచారణకు వస్తారా? లేదా, ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేసి తీసుకువస్తారా? అనేది ఒక చర్చగా సాగుతోంది.

అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర రెడ్డికి మరో దెబ్బ తగిలింది. ఎన్నికల సమయంలో ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నగదును అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఆయన పీఏ ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. కాల్ లొకేషన్ ల ఆధారంగా చెవిరెడ్డి పీఏలు బాలాజీ, నవీన్ లు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి పీఏ బాలాజీనే కావడం విశేషం.

సరిగ్గా.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి, అనుచరుడు వెంకటేశ్ నాయుడు  పోలీసు కస్టడీలో విచారణకు అందుబాటులోకి వచ్చే సమయానికి ఆయన ఇద్దరు పీఏలు కూడా పోలీసుల అదుపులోనే ఉంటారు. నలుగురినీ ఏకకాలంలో వేర్వేరు గదుల్లో ఉంచి విచారించడం ద్వారా.. పోలీసులు అసలు వివరాలు, లోగుట్టులు రాబట్టగలరని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories