ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మాటలను గమనిస్తే.. ఆమె అన్నయ్య జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్ కావడానికి సిద్ధంగానే ఉన్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నా చెల్లెళ్లు విడివిడిగా ఉండడం అనేది ఇద్దరి పతనానికి కారణం అవుతున్న సమయంలో, ఇద్దరూ కలిసిపోతే రాజకీయంగా ఎడ్వాంటేజీ వస్తుందని భావిస్తున్నారా? అనే చర్చ రాజకీయాల్లో ప్రారంభమైంది. తాజాగా వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలు.. వీరిద్దరి పునరేకీకరణకు సంబంధించిన సంకేతాల్లా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొన్ని రోజులుగా రాష్ట్రమంతా పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైఎస్ షర్మిల తాజాగా గోదావరి జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం వంటిదని, పిల్ల కాలువలన్నీ సముద్రంలోకి చేరాల్సిందేనని, వైఎస్సార్ కాంగ్రెస్ కు కూడా ఇది వర్తిస్తుందని ఆమె అన్నారు. ఈ మాటల అర్థం ఏమిటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెసులో విలీనం కాక తప్పదనే కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అత్యంత ఘోరమైన ఓటమి పలకరించిన తర్వాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కళ్లు తెరచుకున్నాయని.. తాను ఒంటరిగా సాధించగలిగేది ఏదీ లేదని ఆయన గ్రహించారని కొన్ని వార్తలు వచ్చాయి. కాంగ్రెసు పార్టీలో విలీనం కావడానికి, తొలిదశలో కాంగ్రెస్ ఉన్న కూటమిలోకి ప్రవేశించి.. ఆ తర్వాత నెమ్మదిగా విలీనం చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుంటూ.. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానంతో రాయబేరాలు నడిపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
ఇండియా కూటమి ఆవిర్భవించడానికి ముందు.. ఎన్డీయేతర పార్టీలన్నీ పలువిడతలుగా సమావేశం అయినప్పుడుకూడా.. ఆ కూటమిలోకి వైఎస్సార్ కాంగ్రెస్ ను ఆహ్వానించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. లెఫ్ట్ పార్టీలు సహా.. మరికొందరు వైసీపీని కూడా కలుపుకోవాలనే ప్రతిపాదనను పెట్టినట్టుగా పుకార్లు వినిపించాయి. అయితే.. రాహుల్ గాంధీ ససేమిరా అన్నట్టుగా తెలిసింది. జగన్ ను ఆహ్వానిస్తే తాను సమావేశంలో ఉండను అని అన్నట్టుగా కూడా అప్పట్లో వినిపించింది. ఆ స్థాయిలో జగన్ పట్ల రాహుల్ లో అసహ్య భావం ఉన్న తరువాత.. ఇక విలీనం సాధ్యం కాదని ఆగిపోయారు. జగన్ కూడా మిన్నకుండిపోయారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నట్టుగానే.. ఇప్పుడు షర్మిల మాటలను గమనిస్తే.. వైసీపీ కూడా వచ్చి కాంగ్రెసులో విలీనం కావాల్సిందే అనడం చూస్తే.. అన్నయ్యను కాంగ్రెసులో కలిపేసుకోవడానికి ఆమె సుముఖమేనా అని పలువురు అనుకుంటున్నారు. అన్నాచెల్లెళ్లు జంటగా తిరిగా ఎన్డీయే కూటమి పార్టీల మీద పోరాటానికి సిద్ధపడతారా? అని వ్యాఖ్యానిస్తున్నారు.