నాయకుడిని అసహ్యించుకుంటే తొత్తులకు ఇస్తారా?

చంద్రబాబునాయుడు తన సభల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గుట్టుమట్టులను బట్టబయలు చేస్తున్నారు. ఆ పార్టీ గతిలేని రాజకీయాలను, కొందరు ఆశ్రితులకు మేలు చేయడానికి తొక్కే అడ్డదారులు సొంత పార్టీ వారినే వంచించే తీరు ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబునాయుడు దెబ్బకు బయటకు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఆ పార్టీకోసం పనిచేసే కార్యకర్తలే.. అధినేత మాయమాటల రూపంలో తాము ఎలా మోసానికి గురవుతున్నామో తెలుసుకుంటున్నారు. పార్టీ మీద తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. ఇలాంటి చిత్రమైన పరిణామాలు చంద్రబాబునాయుడు నిజాల్ని బయటపెట్టడంతో చోటు చేసుకుంటున్నాయి.

వివరాల్లోకి వెళితే.. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో అనేక ముఠాలు ఉన్నాయి. నిత్యం వీరి మధ్య ముఠాకుమ్ములాటలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి అందరు నాయకులను కలుపుకుపోవడంపై ఎన్నడూ దృష్టిపెట్టకుండా అహంకారంతో ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. అదే సమయంలో.. అసలు జొన్నలగడ్డ పద్మావతి కేవలం డమ్మీ మాత్రమేనని, నాయకత్వం రూపంలో ఆమె భర్త సాంబశివారెడ్డి చక్రం తిప్పుతుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఆయన తీరువల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ లో ముఠాలు ప్రబలడం, ఆయన మీద వ్యతిరేకంగా పోరాడడం జరుగుతూ వచ్చింది.

సాంబశివారెడ్డి భార్య సిటింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి.. టికెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీలోని ఇతరవర్గాలు గట్టిగా పట్టుబట్టాయి. వారిని మాయచేస్తూ జగన్మోహన్ రెడ్డి టిప్పర్ డ్రైవరు వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చారు. వాస్తవం తెలిసినా కూడా వైసీపీ ముఠాలు కొద్దిగా శాంతించాయి.

అయితే నియోజకవర్గ పరిధిలో బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబునాయుడు.. సభలో మాట్లాడుతూ.. సాంబశివారెడ్డిని ప్రజలు ఛీ కొడుతోంటే.. ఆయన పనివాడికి జగన్ టికెట్ ఇచ్చారంటూ.. అసలు సీక్రెట్ ను బయటపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నాయకులకు ఇది తెలియని సంగతి కాదు. కానీ, చంద్రబాబు ఈ మాటలు చెప్పిన తర్వాత.. వాటిని ఎడ్వాంటేజీగా తీసుకుని మళ్లీ పార్టీలో తిరుగుబాటు ప్రారంభించారు.

సాంబశివారెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటూ ఉంటే.. ఆయన పనివాడికే మళ్లీ టికెట్ ఇవ్వడం ద్వారా పరోక్షంగా ఆయన చేతిలోనే అధికారం పెడుతున్నారని, చంద్రబాబు మాటలతో ఇది ప్రజలకు కూడా అర్థమవుతోందని, ప్రజలు వైసీపీని ఛీకొడతారని అంటున్నారు. అభ్యర్థిని మారిస్తే తప్ప పార్టీకోసం తాము పనిచేయబోమని హెచ్చరిస్తున్నారు. ఎస్సీ విద్యావంతుడి ముసుగులో సాంబశివారెడ్డి చేతినుంచి అధికారం జారిపోకుండా.. జగన్ చేసిన కుట్ర ఇది అని అభివర్ణిస్తున్నారు. మరి పార్టీలో ఈ ముఠా కుమ్ములాటలను ఎలా సర్దుకుంటారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories