ఓడలు బండ్లయితే.. హెలికాప్టర్లు కార్లయ్యాయి!

బండ్లుఓడలైతే ఓడలు బండ్లవుతాయనేది సామెత. ఈ సామెతలో రెండోభాగం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అచ్చంగా సరిపోతుంది. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నన్నాళ్లూ అనుభవించిన వైభోగానికి, ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా అనుభవిస్తున్న భోగానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రిగా అధికారంలోకి లేకపోయినంత మాత్రాన.. ఆయన ఖర్చులు ప్రభుత్వమే పెట్టకపోయినంత మాత్రాన.. తన సొంత సొమ్ములతో కూడా అంతకంటె వైభోగంగా బతకగలిగిన సంపన్నుడే అయిన జగన్మోహన్ రెడ్డి.. అలా ప్రవర్తించడం లేదు. హఠాత్తుగా చాలా సింప్లిసిటీ ఉన్న నాయకుడు అయిపోతున్నారు. ప్రస్తుతం రెండు రోజులుగా పులివెందులలోనే ఉండి ప్రజలను కలుస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. సోమవారం మధ్యాహ్నం బెంగుళూరుకు కారులో భార్యాసమేతంగా వెళుతున్నారు.

ఇందులో వింతేముంది అనుకుంటున్నారు. వింత ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రిగా తాడేపల్లిలో ఉంటూ, తెనాలిలో ప్రభుత్వ కార్యక్రమం ఉంటే.. అక్కడకు కూడా హెలికాప్టర్ లో మాత్రమే ప్రయాణించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కడపలో కార్యక్రమం ఉంటే హెలికాప్టర్ కాకుండా ప్రత్యేక విమానంలో వెళ్లే నాయకుడు ఆయన. అలాంటిది పులివెందుల నుంచి బెంగుళూరులోని తన ప్యాలెస్ కు అంత దూరం కారులో వెళ్లడం అంటే మాటలు కాదు కదా..! సింప్లిసిటీకి దిగివచ్చేసినట్టే కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతోంటే గాలిలో తప్ప నేలమీద ప్రయాణించరా? ఇప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటే.. కారు చాల్లే అని సర్దుకుంటారా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అహంకారంతో చెలరేగిపోయారని, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ అహంకారం నెమ్మదిగా తగ్గుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ప్రయాణం నేలమీదకు రావడం మాత్రమే కాదు, ఆయన ఆలోచనా సరళి, బుద్ధులు కూడా ఆకాశంలో విహరించడం మానేసి నేలమీదకు రావాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories