రాజకీయాల్లో సాధారణంగా ఏమాత్రం అర్థం పర్థంలేని ఆచరణ సాధ్యం కాని సవాళ్లే వినిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఏపీలో మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టి సవాలే విసిరారు. తనమీద చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసేస్తానన్నారు. అదే సమయంలో ఆరోపణలు అబద్ధం అని తేలితే గనుక.. జగన్ యువతరానికి క్షమాపణ చెబితే చాలునని మినహాయింపు ఇచ్చారు.
సాధారణంగా రాజకీయ సవాళ్లు ఇలా ఉండవు. కనీసం.. ‘నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి’ అనే తరహాలోనే ఈ సవాళ్లు సాగుతుంటాయని అందరికీ తెలుసు. కానీ నారా లోకేష్ చాలా ఫెయిర్ గా సవాలు విసిరారు. తనమీద చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించలేకపోతే.. జగన్ కేవలం యువతరానికి క్షమాపణ చెబితే చాలు అని అంటున్నారు.
ఇంతకూ ఏ విషయం మీద ఈ రాద్ధాంతం జరుగుతున్నదో తెలుసునా?
విశాఖపట్టణంలో ఉర్సా కంపెనీకి ఎకరం ఒక రూపాయి ధరకు కట్టబెట్టారంటూ.. జగన్ దళాలు సుదీర్ఘకాలంగా విషం కక్కుతున్నాయి. వారి కరపత్రిక నిండా పేజీల కొద్దీ కథనాలు ఇచ్చాయి. వారి చానెళ్లలో గంటలకొద్దీ విషం కక్కాయి. ఉర్సా కంపెనీకి ఎకరం రూపాయి వంతున వేల కోట్లు దోచిపెట్టారనేది వారి ప్రచారం. ప్రభుత్వం తరఫున తొలినుంచి ఆ ప్రచారాల్ని ఖండిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. వారి విషం వారు చిమ్ముతూనే వెళ్లారు. నారా లోకేష్ బినామీ కంపెనీ అంటూ కొత్త ప్రచారం కూడా చేశారు.
తీరా ఇప్పుడు నారా లోకేష్ స్వయంగా సవాలు విసరుతున్నారు. ఉర్సా కంపెనీకి ఎకరం రూపాయికి కట్టబెట్టినట్టుగా ఏ ఒక్క ఆధారం చూపించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. ఎకరం కోటి వంతున మూడు ఎకరాలు, ఎకరం యాభై లక్షల వంతున 56.36 ఎకరాలు కాపులుప్పాడ వద్ద కేటాయించినట్టు ఆయన చెబుతున్నారు. ఆరోపణలు చేసి పారిపోవడం జగన్ కు కొత్త కాదు అని ఎద్దేవా చేస్తున్నారు. బురద చల్లి ప్యాలెస్ లో దాక్కోవడం కాదు.. నిరూపించాలని సవాలు విసురుతున్నారు.
ఈ సవాలు గనుక స్వీకరించకుంటే.. జగన్ పిరికివాడనే అనుకోవాలి. ఎందుకంటే.. విపరీతంగా దుష్ప్రచారం చేసింది వారే! అందువల్ల ఎకరం రూపాయికి ఇచ్చినట్టుగా ఏదోఒక ఆధారం చూపించాలి. లోకేష్ తో రాజీనామా చేయించగలగాలి. అది చేతకాకపోతే.. యువతముందు లెంపలు వేసుకుని.. అత్యుత్సాహంతో తప్పుడు ఆరోపణలు చేసినట్టు ఒప్పుకోవాలని ప్రజలు అంటున్నారు.