ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 చాలా ఘనంగా మొదలైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ ఈవెంట్లో 90కి పైగా దేశాల నుంచి, పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్లు పాల్గొంటున్నారు.
అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ భారత సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు, వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా భాగం అవుతున్నారు. కాగా ఈ వేదికలో భాగంగా.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేవ్స్ సమిట్ను నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా ప్రస్తావించారు.
పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.. ‘ మా తాత అల్లు రామలింగయ్య 1000కి పైగా సినిమాల్లో నటించారు. మా తండ్రి అల్లు అరవింద్ 70 సినిమాలు నిర్మించారు. నేను ఈ స్థాయికి వచ్చాను అంటే మా మామ చిరంజీవి అభిమానుల సపోర్ట్ తోనే. ‘పుష్ప’ సినిమాతో నాకు జాతీయ స్థాయి గుర్తింపు అందింది.
అందరికి చెప్పేది ఒకటే ప్రతి నటుడికి ఫిట్నెస్ చాలా ముఖ్యం. షూటింగ్లో లేనప్పుడు కూడా ఫిట్నెస్ని లైట్ తీసుకోకూడదు. నాకు సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. షూటింగ్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను.. ఇక సినిమాల్లో సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాను’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.