లిక్కర్ కుట్రల్లో తొలి రాజకీయ అరెస్టు: చెవిరెడ్డి!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన భార్య వైఎస్ భారతికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన.. ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ జగన్ తర్వాత అంతటి విశృంఖలాధికారాలతో చక్రంతిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరు కెంపెగౌడ విమానాశ్రయం నుంచి కొలంబో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న చెవిరెడ్డిని లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు అరెస్టు చేశారు. చెవిరెడ్డి ఈ రకంగా విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నదని ముందుగానే సమాచారం అందడంతో వారం రోజుల కిందటే.. పోలీసులు ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఆయన బెంగుళూరు నుంచి కొలంబో ప్రయాణం పెట్టుకున్న తర్వాత.. ఎయిర్ పోర్టు పోలీసుల నుంచి ఆమేరకు వారికి సమాచారం అందింది. దీంతో బెంగుళూరు వెళ్లిన సిట్ పోలీసులు చెవిరెడ్డిని, ఆయనతో పాటు మద్యం కేసులో మరో పాత్రధారి అయిన చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు లను అరెస్టు చేశారు. వీరి అరెస్టులతో పాటు చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి సహా ఇంకా పలువురిని లిక్కర్ స్కామ్ లో నిందితులుగా చేర్చారు. కాగా, లిక్కర్ స్కామ్ లో ఒక రాజకీయ నాయుడిని అరెస్టు చేయడం ఇదే ప్రథమం.
జగన్ సర్కారు తీసుకు వచ్చిన కొత్త లిక్కర్ విధానాన్ని ముసుగుగా చేసుకుని.. వైఎస్ జగన్ అండ్ కో దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ముడుపులు కాజేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న మద్యం కుంభకోణం.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. అంతిమ లబ్ధిదారు, ప్రధాన వ్యూహకర్త గా జగన్ వైపే అందరి అనుమానాలు వేలెత్తి చూపుతున్న వేళ.. ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చెవిరెడ్డి అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.

లిక్కర్ కుంభకోణంలో ఏ1 నిందితుడు, మద్యం కంపెనీల నుంచి ముడుపులను వసూలు చేసి.. వైసీపీ అంతిమ లబ్ధిదారుకు అందజేయడానికి ఒక సొంత ప్రెవేట్ నెట్ వర్క్ ను నడిపించిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ఆరునెలలముందు నుంచి వందల కోట్ల రూపాయల నగదును హైదరాబాదులో చెవిరెడ్డికి అందజేసినట్టుగా పోలీసులు నిగ్గుతేల్చారు. చెవిరెడ్డి తన వద్ద పనిచేసే కొందరు పీఏలు, గన్ మెన్లు, డ్రైవర్లు, అనుచరులు, సన్నిహితుల ద్వారా.. హైదరాబాదు- బెంగుళూరుల్లోని పలుప్రాంతాలకు ఈ సొమ్మును తరలిస్తూ వచ్చారు. ఎన్నికలకు కొన్ని రోజులముందు.. అయిదు జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు సొమ్ములు చేర్చారు. ఆ ప్రయత్నాల్లో పైపుల లారీ కేబిన్ లో ప్రత్యేక అరలు ఏర్పాటుచేసి ఎనిమిదిన్నర కోట్ల నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అదంతా మద్యం కుంభకోణంలోని నగదేఅని పోలీసులు తాజాగా తేల్చారు. చెవిరెడ్డి సన్నిహితుడు అయిన వెంకటేశ్ నాయుడు వద్దకు రాజ్ కెసిరెడ్డి సొమ్ము చేర్చగా.. ఆయన వివిధ మార్గాల్లో అనాజ్ పూర్ వద్దకు తరలించి అక్కడ లారీలో లోడ్ చేయించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు.

లిక్కర్ కేసులో చెవిరెడ్డి పేరు బయటకు వచ్చిన తర్వాత.. ఆయన మాత్రం ఎదురుదాడికి దగారు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలీసులు మాత్రం పక్కా ఆధారాలు సిద్ధం చేసుకుని ముందుగానే ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. ఆయన, మరో నిందితుడు వెంకటేశ్ నాయుడు కుటుంబంతో కలిసి కొలంబో పారిపోయే ప్రయత్నంలోఉండగా పోలీసులు అరెస్టు చేయడం విశేషం.
చెవిరెడ్డితో పాటు ఈకేసులో ఆయన కొడుకు మోహిత్ రెడ్డి, ఆయన అనుచరులు బాలాజీయాదవ్, నవీన్, హరీష్ లను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. దీంతో మొత్తం నిందితుల సంఖ్య 39కి చేరింది.

Related Posts

Comments

spot_img

Recent Stories