అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అనేకమంది ప్రయాణికులతో పాటు అటుగా వెళ్తున్న సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఈ ఘటనలో మరొక విషాదకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. గుజరాతీ సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ దర్శకుడు మహేష్ జిరావాల కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు తాజాగా తెలిసింది.
కాక్టెయిల్ ప్రేమీ పగ్ ఆఫ్ రివెంజ్ అనే గుజరాతీ చిత్రాన్ని డైరెక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న మహేష్… ఈ విమానంలో అసలు ప్రయాణించలేదు. కానీ దురదృష్టవశాత్తు విమానం కూలిన దగ్గరే ఆ రోజు ఆయన ఉన్నారు. ఆ ప్రాంతంలో తన స్నేహితులను కలవడానికి వెళ్లిన మహేష్ ఆ ప్రమాదంలో బలయ్యారు. సంఘటన జరిగిన రోజే ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు.
పోలీసులు సంఘటనా ప్రాంతంలో లభించిన కొన్ని శవాల మధ్య అతని దేహం ఉండవచ్చునని భావించి కుటుంబ సభ్యులకు ఓ శవాన్ని చూపించారు. కానీ వారు మొదట అది మహేష్ దేహమని ఒప్పుకోలేదు. తీరా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాక అది మహేష్ అని తేలింది. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆయన అభిమానులు, ఇండస్ట్రీ circles లో దిగ్బ్రాంతి నెలకొంది.
కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సంగీతం పట్ల కూడా మహేష్ కి ఆసక్తి ఉండేది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కి కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చారని సమాచారం. యువ దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అందరికీ బాధను కలిగించింది. ఈ ఘటన చుట్టూ నెలకొన్న విషాదం ఇంకొంత ఎక్కువైంది.