జనంలోకి వెళ్లే ధైర్యం జగన్ కు ఉందా.. సజ్జలా!

జూన్ 4! సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదేళ్లపాటు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన దురహంకార పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు! కేవలం 11 సీట్లకు పరిమితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూపతనం చేసిన రోజు. ఇప్పటికి సరిగ్గా ఏడాది గడుస్తోంది. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఈ సందర్భంగా దీపావళి, సంక్రాంతి పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలని తలపోస్తుంటే.. విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు గనుక వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ నెల నాలుగవ తేదీన రెండు పార్టీలు కూడా పోటాపోటీగా రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఏ పార్టీ కార్యక్రమం ఏ స్థాయిలో జరుగుతుంది- ఏ పార్టీ తాము తలపెట్టిన విషయం మీద పూర్తిగా ఫోకస్ పెడుతుంది అనేది అర్థం కావడం లేదు.

జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనను  అంతమొందించిన రోజు గనుక ఆరోజు దీపావళిని, కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన రోజు గనుక సంక్రాంతి పండుగను కలిపి ప్రజలు టపాకాయలు పేల్చి, ఇళ్ళ ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి సెలెబ్రేట్ చేసుకోవాలనేది పాలకకూటమి ఇస్తున్న పిలుపు. ఇలా వేసిన ముగ్గులను, టపాకాయలు పేల్చే దృశ్యాలను అన్నింటిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో హోరెత్తించాలని కూడా ఆ పార్టీ నాయకులు పిలుపు ఇచ్చారు.

అదే సమయంలో ప్రతి ఊరిలోనూ రాష్ట్రవ్యాప్త నిరసనలు నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ఆరాటం. వెన్నుపోటు దినోత్సవం అని జగన్ పేరు పెట్టారు. తాజాగా బుధవారం నాడు ఈ పోటాపోటీ కార్యక్రమాల నేపథ్యంలో ఏం జరుగుతుంది అని వైసిపి డి ఫ్యాక్టో సారథి సజ్జల రామకృష్ణారెడ్డిని విలేకరులు అడిగినప్పుడు ఆయన చాలా చిత్రమైన సమాధానం చెప్పారు.

దీపావళి సంబరాలు చేసుకోవాలని పిలుపు ఇస్తున్నవారు.. జనంలోకి వెళ్లి చిచ్చుబుడ్డి వెలిగిస్తే.. ఆ జనం ఎలా స్పందిస్తారో అప్పుడు తెలుస్తుంది అని సజ్జల వెటకారం చేస్తున్నారు. ఈ వెటకారం చాలా వెగటుగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం ఈ ఏడాది రోజులలో ఇది తొలిసారి కాదు. గతంలో ఇలాంటివే నాలుగు కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అంతకంటే కామెడీ ఏంటంటే ఒక్క కార్యక్రమంలో కూడా జగన్ స్వయంగా పాల్గొనలేదు. జనంలోకి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్మోహన్ రెడ్డికి దమ్ములు లేవని అందరూ అనుకున్నారు. అలాంటి జగన్ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి అధికార పార్టీ వారికి జనంలోకి వచ్చి చిచ్చు బుడ్డి వెలిగించాలని సవాల్ విసరడం తమాషాగా ఉంది. ఈ ఏడాది రోజులలో ప్రతి కార్యక్రమంలోనూ మంత్రులందరూ కూడా ప్రజలలో ఉండే సెలెబ్రేట్ చేస్తున్నారు. వైసిపి హయాంలో జగన్ తప్ప మిగిలిన మంత్రులు ప్రజా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్న సందర్భాలు లేవు. ఈ వాస్తవాలు అన్నింటినీ మరిచిపోయి సజ్జల  సవాలు విసురుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

కనీసం జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన వెన్నుపోటు దినోత్సవ నిరసన కార్యక్రమాలలో అయినా సరే స్వయంగా పాల్గొనే ధైర్యం ఆయనకు ఉన్నదా అనేది ప్రజల సందేహం. ప్రజల్లోకి రావాలని పాలక పక్షం వారికి సవాలు విసిరే ముందు, జగన్ కూడా నేరుగా పాల్గొంటున్నారని సజ్జల క్లారిటీ గా చెప్పగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories