చెల్లెలి మీద జగన్ ఈ దుర్మార్గానికి కూడా ఒడిగట్టారా?

సొంత చెల్లెలికి ఆస్తులు పంచి ఇవ్వడం గురించి.. చాలా పెద్ద తగాదా పెట్టుకుని బజారుపాలయ్యారు. కన్న తల్లికి గిఫ్టు కింద ఇచ్చిన షేర్లను కూడా తనకు తిరిగి ఇవ్వాలని, ఆమె మీద ప్రేమ తగ్గిపోయింది గనుక.. ఇప్పుడు ఇవ్వదలచుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ కు వెళ్లి అభాసుపాలు కావడం అందరికీ తెలిసిన సంగతే.  అయితే సొంత చెల్లెలి మీద నిఘా పెట్టే ప్రయత్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి దుశ్చర్యలకు, దురాగతాలకు తెగించారో.. ఇప్పుడు కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ షర్మిల సొంతంగా కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన నేపథ్యంలో.. ఆమె ఫోనును కూడా అక్కడి పోలీసులు అప్పట్లో ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షర్మిల ఫోనును ట్యాప్ చేసి.. ఆమె కాల్స్ వివరాలను అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ వచ్చారని కూడా తాజాగా వెలుగుచూస్తోంది.
వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకురావడానికి 2019 ఎన్నికలకు పూర్వం.. తన శక్తికి మించి పాటుపడ్డారు. జగన్ తో సమానంగా ఆమె ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఆమెతో పాటుగా జగన్ తల్లి విజయమ్మ కూడా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి రాగానే.. షర్మిల తన కష్టానికి తగిన ప్రతిఫలం రాజకీయ అవకాశం రూపంలో కోరుకున్నారు. తనకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని కలగన్నారు. అయితే.. నిత్యం అభద్రత భావంలో బతుకుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. రాజకీయంగా తన కుటుంబంలో మరో వ్యక్తి ఉంటే.. ఎక్కడ తన ప్రాధాన్యం తగ్గిపోతుందో అనే భయంతో.. చెల్లెలికి పదవి ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదు. తల్లి మాటను కూడా పెడచెవిన పెట్టారు. తనను గెలిపించడానికి చెల్లెలు పడిన కష్టాన్ని తోసిరాజన్నారు. తీరా అన్నతో తెగతెంపులు చేసుకుని తెలంగాణకు వెళ్లి అక్కడ ఏదో రాజకీయ అస్తిత్వం కోసం షర్మిల ఒక పార్టీ స్థాపించుకుంటే.. దానిని కూడా మననీయకుండా చేయడానికి అప్పటి భారాస ప్రభుత్వంతో కలిసి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేసినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.

భారాస సర్కారు తమ రాజకీయ ప్రత్యర్థులందరి ఫోన్లను ట్యాప్ చేయించి వారి గుట్టుమట్టులు తెలుసుకుంటూ వచ్చిన సంగతి కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తరవాత వెలుగులోకి వచ్చింది. భారాస ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటూ ఒక గ్రూపు పోలీసులు వారికి ట్యాపింగ్ చేసి పెట్టారు. ఈ క్రమంలో వారు తెలంగాణ రాజకీయ ప్రత్యర్తులతో పాటు షర్మిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని వెలుగులోకి వచ్చింది. షర్మిల ఫోన్ సంభాషణలనుంచి సేకరించిన కీలక సమాచారాన్ని అప్పటి భారాస సర్కారు జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ వచ్చిందని కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ నిందితుల విచారణ తుదిదశకు వస్తున్న సమయంలో.. జగన్ చేసిన పాపాలు కూడా వెలుగులోకి వస్తే.. ఆయన కూడా తెలంగాణ ప్రభుత్వపు కేసుల్లో ఒక అతిపెద్ద కేసులో ఇరుక్కుంటారనేది తథ్యం. ఏపీలో ఒకవైపు జగన్ ను ప్రధాన నిందితుడిగా చూపించగల కేసులు అనేకం ముసురుకుంటూ ఉండగా.. వాటిని మించి.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు డైరక్టుగా జగన్ పాత్రను పట్టిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories