వెనకటికి ఒక ప్రబుద్ధుడు ‘‘ఆత్రగాడికి ఆకులో వడ్డించవచ్చు గానీ.. నాకు నేలమీద వడ్డించేయ్ సరిపోతుంది’’ అన్నాట్ట. ఆ సామెత మాదిరిగానే ఉంది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా. తమకు అధికారం అప్పగిస్తే.. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తాం అని కూటమి పార్టీలు ప్రజలకు హామీ ఇచ్చిన మాట నిజం. అయితే ఏదో వాటాలు విభజించినట్టుగా ప్రతి ఏడాది కనీసం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ పోతాం అని దాని అర్థం కాదు. ఆ సంగతి యువతరానికి తెలుసు. ఒకవైపు ఉద్యోగాల కల్పన పరంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి నిరాశ లేకుండా రేపో మాపో ఉద్యోగపర్వం మొదలవుతుందని ఆశతో ఉన్నారు. ఈలోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్రపడి నిర్వహించిన నిరుద్యోగుల నిరసనలు.. వారి చిత్తశుద్ధికి తగ్గట్టుగానే తుస్సుమన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా నిరుద్యోగుల నిరసన దీక్షలు సక్సెస్ ఫుల్ గా ప్రభుత్వం మీద తమ అసంతృప్తిని ప్రకటించే విధంగా సాగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులిచ్చి తోలించిన మనుషులు మాత్రం కొన్ని చోట్ల కనిపించారు. ఆ కొన్ని చోట్ల కూడా.. వృద్ధులు, వృద్ధ మహిళలు నిరసనలకు రావడం ఆ పార్టీ పరువు మరింత తీసేలా సాగిపోయింది. ఒకటిరెండు చోట్ల.. కలెక్టరు కార్యాలయాల్లోకి వెళ్లి తమ వినతిపత్రం ఇవ్వడానికి సహజంగా అనుమతి కొందరికేఉంటుంది గానీ.. కార్యకర్తలు గుంపులుగా తోసుకుని లోనికి వెళ్లి అక్కడ కూడా తమ దౌర్జన్యాలను ప్రదర్శించాలని అనుకోవడం గమనార్హం. కొన్నిచోట్ల అసలు నిరసనల్లో పాల్గొనడానికి నాయకులకు కూడా మొహం చెల్లలేదు. జస్ట్ ప్రదర్శనకు జెండా ఊపి వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలా రకరకాలుగా జగన్ పిలుపు ఇచ్చిన నిరసనలు తుస్సు మన్నాయి.
కూటమ సర్కారు అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నమాట నిజం. తొలి ఏడాదిలో కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రయత్నలోపం ఉందని అనడానికి వీల్లేదు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు విశాఖకు రావడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మెగా డీఎస్సీ కూడా పూర్తయింది. వేల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఒకటో ఏడాది జరుగుతున్న కసరత్తు ఫలితంగా ఒకేసారి మూడో నాలుగో ఏళ్లలో పదిలక్షల ఉద్యోగాల వరకు భర్తీ అయినా ఆశ్చర్యం లేదు. అలాంటిది జగన్ దళాలు.. ప్రతి ఏడాది నాలుగు లక్షలు జరగాలన్నట్టుగా ఈ నిరసనలు చేయడం వారినే నవ్వుల పాలు చేస్తున్నాయి.
రెంటపాళ్ల యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి లింగయ్య మరణించిన ఘటన మీదనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ ఇలాంటి నిరసనలకు పిలుపు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. కుట్రపూరితమైన దురుద్దేశపూరితమైన ఈ నిరసనలను ప్రజలు పట్టించుకోకుండా వదిలేయడంలో ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.