చెవిరెడ్డి పరారీ స్కెచ్ ఫెయిల్ : పట్టుకున్న పోలీసులు!

తమ మీద కేసులు నమోదు అయిన తర్వాత.. విచారణకు హాజరై తమ వాదన వినిపించి, తాను శుద్ధపూసను అని నిరూపించుకోవడం అవసరం. రాజకీయంగా కూడా అది వారికి మేలు చేస్తుంది. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలినుంచి అనుసరిస్తున్న తీరే వేరు. కేసులు నమోదు కాగానే.. పరారీలోకి వెళ్లిపోవడం.. ముందస్తు బెయిలు కోసం అప్లయి చేసుకోవడం, అరెస్టు నుంచి రక్షణ కావాలని కోర్టుకు విన్నవించడం.. ఆ రెండింటిలో ఏదో ఒకటి దక్కిన తర్వాత.. పరారీలోంచి బయటకు రావడం.. మళ్లీ యథారీతిగా రెచ్చిపోయి ప్రవర్తించడం అనేది వారికి రివాజుగా మారింది.

అదే క్రమంలో.. తనమీద అనేక కేసులు ఉండగా.. దేశంనుంచే పరారీ కావడానికి ప్రయత్నంచిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోలీసులకు దొరికిపోయారు. ఆయన విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నదనే అనుమానంతో వారం రోజుల కిందటే.. పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసి ఉన్నందున.. ఆయన బెంగుళూరు ఎయిర్ పోర్టు నుంచి కొలంబో వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఆయనను అక్కడినుంచి విజయవాడకు తరలించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.

దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులు పలువురు ఇప్పటికే అరెస్టు అయి రిమాండులో జైల్లో గడుపుతున్నారు. అరెస్టు అయిన వారిలో ఏ ఒక్కరు బయటకు వచ్చినా సరే.. మొత్తం కేసును తప్పుదారి పట్టించేయగలరని, సిట్ చాలా పట్టుదలగా దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలో.. లిక్కర్ కుంభకోణంతో.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్టుగా సిట్ పోలీసులు గుర్తించారు. పైగా గత 2024 ఎన్నికల సమయంలో.. ఆయన పీఏ ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో 8.20 కోట్ల రూపాయలు కారులో తీసుకువస్తూ పట్టుబడినందుకు వారి మీద ఎన్నికల సంఘం నమోదు చేసిన కేసు కూడా ఉంది.

మద్యం అక్రమలావాదేవీల సొమ్మును చెవిరెడ్డి తన మనుషులతో ఎన్నికల అవసరాలకు మళ్లిస్తున్నట్టుగా అప్పట్లో పుకార్లు వచ్చాయి. చెవిరెడ్డి మాజీ గన్ మెన్ ను, ఆయన డ్రైవరును పోలీసులు ఇప్పటికే విచారించారు. కాగా, చెవిరెడ్డి గన్ మెన్ ఒకరు.. తనతో సిట్ పోలీసులు బలవంతంగా చెవిరెడ్డి పాత్ర ఉన్నట్టుగా చెప్పించారని, స్టేట్మెంట్ రాయించారని డీజీపీకి, సీఎంకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులన్నీ అలాగే ఉండగా.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి బెంగుళూరు నుంచి కొలంబో వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. లుకౌట్ నోటీసు ఉండడం మూలాన ఆ సంగతి పసిగట్టడంతో బెంగుళూరు విమానాశ్రయ పోలీసులు ముందుగానే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు.. బెంగుళూరు వెళ్లి చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే పలువురు అధికారులను, ఇతర వ్యక్తులను సిట్ పోలీసులు అరెస్టు చేసి విచారించి, వివరాలు సేకరించడం జరిగింది. మొదటిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడిని అరెస్టు చేస్తున్నారు. జగన్, భారతిలకు ఎంతో సన్నిహితుడైన చెవిరెడ్డిని అరెస్టు చేయడం మేజర్ పరిణామం అని అంతా అంటున్నారు. ఆయనను విచారించడం ద్వారా ఎన్నో కీలక వివరాలు బయటకు వస్తాయని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories