కొన్నాళ్ల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ‘మహా అయితే ఏం చేస్తారు? నన్ను అరెస్టు చేస్తారా? చేసుకోండి. విజయవాడలోనే ఉన్నాను. వచ్చి చేసుకోండి’ అంటూ సవాళ్లు విసిరారు. ఒకవైపు అయిదేళ్లు దక్కిన అధికారంలో చేసిన పాపాలన్నీ వెలుగులోకి వస్తుండగా.. అనుక్షణం అరెస్టు భయంతో వణికిపోతున్న జగన్మోహన్ రెడ్డి.. ఈ మాటల ద్వారా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. తన మీద ఎలాంటి పోలీసు చర్య తీసుకున్నా సరే.. దానిని రాజకీయ కక్ష సాధింపుల ఖాతాలోకి నెట్టేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగని.. చర్యతీసుకోకుండా ఉండగలిగేలా ఆయన ప్రవర్తించడం లేదు కూడా..! ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైనదంటే.. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులు చేస్తున్నారు.. చేయిస్తున్నారు అంటే.. ఆయన విజయవాడలో లేకపోయినా సరే.. బెంగుళూరు ప్యాలెస్ కాదు కదా.. సప్తసముద్రాల అవతల ద్వీపంలో మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నా సరే పట్టుకువచ్చి శిక్షించాలని అనిపించేంత ఆగ్రహం కలిగిస్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా అంతే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డికి వార్నింగు ఇస్తున్నారు.
జగన్ తీరు మీద సీఎం మండిపడుతున్నారు. ‘ఎంత దైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారంటూ ఆగ్రహిస్తున్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు.. పొదిలిలో జగన్ బాధ్యత లేకుండా పర్యటించారని.. రౌడీలను వెంటేసుకుని వెళ్లి.. మహిళల మీద దాడులు చేయించారని ఆరోపించారు. దేవతల రాజధానిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుపట్టారు.
‘ఇప్పటివరకూ నా మంచితనాన్ని చూశారు. ఇకపై ఉపేక్షించేది లేదు. హద్దు మీరితే సహించేది లేదు.. 11 సీట్లకు జనం పరిమితం చేసినా బుద్ధి రాలేదు. వైకాపా తీరును మరోసారి ఆధారాలతో ఎండగడతా..’ అంటూ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సహా.. అనేక కుంభకోణాల్లో స్వయంగా జగన్ మోహన్ రెడ్డి పాత్ర నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తోంది. గమనించాల్సిన మరో సంగతి ఏంటంటే.. చాలా క్లియర్ గా వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం జరిగిన ఇసుక కుంభకోణం జోలికి కూటమి ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు. జగన్ తన అతి మాటలు చేతల ద్వారా.. ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ.. తన సకల పాపాల మీద సత్వరమే దృష్టి సారించే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. అదే జరిగితే.. ఇక ఎప్పటికీ బెయిలు కూడా దొరకని విధంగా అవినీతికేసుల్లో ఇరుక్కుని ఆయన జైలు పాలు కావాల్సి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.