ప్రమాదాల్లో చనిపోయిన వారికి కూడా ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగితే.. కంపెనీ ద్వారా మరణించిన వారికి కోటిరూపాయలు వంతున ఇప్పించి.. అక్కడికేదో తన ప్రభుత్వమే ఇచ్చినట్టుగా ఆయన బిల్డప్పులు ఇస్తుంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు స్వయంగా తాను ప్రయాణిస్తున్న కారు కింద, తన పార్టీ కార్యకర్త అయిన వృద్ధుడు పడి మరణిస్తే అతడి కుటుంబానికి ఏం సాయం అందిస్తున్నాడు? కనీసం అతడిని పరామర్శించడానికైనా జగన్ కు ఖాళీ లేదా? తన పార్టీ కార్యకర్తలు మరణిస్తే.. వారికి తన పార్టీ తరఫున ఆయన ఎలాంటి సాయాన్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నాడు? అనేది ఇప్పుడు సర్వత్రా ప్రశ్నార్థకం అవుతోంది. అదే సమయంలో.. జగన్ చెల్లెలు ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిల, మరణించిన వారికి జగన్ చెల్లించవలసిన పరిహారం గురించి ఒక కొత్త డిమాండు తెరపైకి తెచ్చారు. అసలు ఆమె చెబుతున్న మొత్తం జరిగిన దుర్ఘటన తీవ్రత దృష్ట్యా సహేతుకమే అయినప్పటికీ.. జగన్ ఇవ్వగలరా? ఆయనకు అసలు మనసొప్పుతుందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. తన వాహనం కింద పార్టీ కార్యకర్త పడి మరణిస్తే.. జగన్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ కారు కింద ఓ వృద్ధుడు పడి మరణిస్తే.. ఆ దుర్ఘటనను కల్పితం అని జగన్ అభివర్ణించడం చాలా దారుణం అని వ్యాఖ్యానించారు. సింగయ్య కుటుంబానికి 5 నుంచి 10 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పరిహారం కింద చెల్లించాలని ఆమె డిమాండు చేశారు. ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఇప్పటిదాకా జగన్ కనీసం క్షమాపణ కూడా చెప్పకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు.
చెల్లెలు షర్మిల చెప్పినట్టుగా తన కారు కింద పడి మరణించిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవడానికి, జగన్ కు అంతటి సహృదయం ఉందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకం.
ఎక్కడైనా దొమ్మీల్లో, వ్యక్తిగత తగాదాల కారణంగా ఎవరైనా తన పార్టీ వారు మరణించినా కూడా.. వాటికి రాజకీయ హత్యలుగా రంగుపులిమి రాద్ధాంతం చేయడానికి వారి కుటుంబాలను పరామర్శించి.. ఏదో ఆదుకున్నట్టుగా సాయం ప్రకటిస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు.. తన కారణంగానే.. ఒక వృద్ధుడు మరణిస్తే.. అతడి కుటుంబం పట్ల ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. పార్టీ కోసం అవసరం అంటూ కొత్త మద్యం విధానం తయారుచేసి మూడున్నర వేల కోట్ల రూపాయలు దోచుకున్న తర్వాత కూడా.. పార్టీ అభ్యర్థుల విజయానికి డబ్బు కూడా అందించని జగన్మోహన్ రెడ్డి.. తన కారణగా ఎవ్వరు చనిపోయినా సరే.. వారికి కోట్ల సాయం అందిస్తారా? అని పార్టీ వారే ముక్కున వేలేసుకుంటున్నారు.