నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ ఎంతటి హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో బాలయ్య అఘోరి గెటప్లో ఓ స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ అఖండ 2 – తాండవం పై అంచనాలు మామూలుగా లేవు. అభిమానులలో అఖండ 2 కి సంబంధించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే బాలయ్యతో కలిసి జార్జియాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశారు. ఇప్పుడు మరో షెడ్యూల్ కోసం బాలకృష్ణ హైదరాబాద్కి వచ్చి, రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు థమన్. మళ్లీ ఆయన బీట్స్తో మాస్ ఊపు తీసుకొస్తాడన్న నమ్మకం యూనిట్కు ఉంది. ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు రామ్ ఆచంట, గోపీ ఆచంటలు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, యంగ్ యాక్టర్ ఆది పినిశెట్టి ఈసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అఖండతో బాలయ్య – బోయపాటి కాంబో మూడు విజయాలు అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు నాల్గవసారి ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది.
కెమెరా పనులకు సి.రామ్ ప్రసాద్, సంతోష్ డిటాకే కలిసి పనిచేస్తున్నారు. భారీ మేకింగ్తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్కి వచ్చిన స్పందన చూస్తే బాలయ్య మళ్లీ మాస్ మానియా రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.