యథావిధిగా..: పిలుపిచ్చి పలాయనం చిత్తగించిన జగనన్న!

జగనన్న అంతే. ఆయన పిలుపు మాత్రమే ఇస్తారు.. పార్టీ కార్యకర్తలందరూ దానిని ఫాలో కావాలి. ఆయన డైరక్షన్ మాత్రమే చేస్తారు.. అందరూ దానిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన మాత్రం ప్యాలెస్ దాటి బయటకు రారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. కనీసం తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అందుబాటులో ఉండరు. ఏకంగా బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో మాత్రమే తిష్ట వేస్తారు. అక్కడినుంచి కేవలం ట్వీట్ ద్వారా మాత్రమే మార్గనిర్దేశనం చేస్తుంటారు. ట్వీట్ ద్వారా మాత్రమే.. పోరాడిన కార్యకర్తలను అభినందిస్తుంటారు. ఇదీ జగన్మోహన్ రెడ్డి తీరు!
జూన్ 4వ తేదీన తనను ఏపీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఏడాది గడుస్తున్న రోజున.. రాష్ట్రమంతా వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజలు ఏమాత్రం పట్టించుకోని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ కూడా రాబోయే రెండు నెలల్లో కార్యరూపం దాలుస్తున్నట్టుగా స్పష్టమైన షెడ్యూలు కూడా వచ్చేసిన తర్వాత.. జగన్ పిలుపును సహజంగానే ప్రజలెవ్వరూ పట్టించుకోలేదు. కానీ తాడేపల్లి నుంచి ఆదేశాలు ఉన్నాయి గనుక.. వెంటపడుతున్నారు గనుక.. ప్రతిచోటా ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నాయకులు ఆరాటపడ్డారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించిన కొన్ని చోట్ల  ఒక మోస్తరుగానూ.. ఖర్చుకు నాయకులు వెనుకాడిన అనేక ప్రాంతాల్లో నీరసంగానూ ఈ కార్యక్రమం జరిగింది.

అయితే ఈ కార్య్రమం ద్వారా హైలైట్ కావడానికి, వార్తల్లో వ్యక్తులుగా నిలవడానికి వైసీపీ నాయకులు చాలా తాపత్రయపడ్డారు. సీఐమీద దాదాపు కొట్టడానికి మీదికెళ్లిన రేంజిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోగా.. మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ర్యాలీ వాహనం మీద నుంచే అస్వస్థతకు గురైనట్టుగా ఒక హైడ్రామా నడిపించారు. మెజారిటీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రభుత్వాన్ని తిట్టడం మీదనే ఫోకస్ చేశారు తప్ప రోడ్లమీద కార్యక్రమాల్ని నామమాత్రంగా చేశారు.

ఇదంతా కూడా ఒకే.. అసలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. వెన్నుపోటు దినం నాడు ఏం చేస్తున్నారు? తెనాలిలో పోలీసు కానిస్టేబుల్ ను చంపడానికి ప్రయత్నించిన రౌడీషీటర్ల  కుటుంబాలను పరామర్శించడానికి తెనాలి దాకా వెళ్లి, తన పరువు తానే తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మళ్లీ ప్రజల్లోకి రావడానికి మొహం చెల్లలేదో ఏమో గానీ.. ఆయన నేరుగా బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు  పారిపోయారు. అక్కడినుంచే ట్వీట్ చేసి, వెన్నుపోటు దినం సక్సెస్ చేసిన పార్టీ కేడర్ కు అభినందనలు తెలిపారు. తాను స్వయంగా సారథ్యం వహించకుండా.. ఇంత ఘోరంగా పార్టీని నడుపు తున్నారు గనుకనే.. వైసీపీ నుంచి లెక్కకు మిక్కిలిగా నాయకులు వలసలు పోతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories