నిన్నటి రెంటపాళ్ల పర్యటన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన చవకబారు తనాన్ని మరింతగా బయటపెట్టుకుంటున్నది. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ అత్యంత లేకిగా రాజకీయ మైలేజీ కోరుకుంటున్న వైనం గమనించిన ప్రజలు ఈసడించుకుంటున్నారు.
ఆరోపణ : జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తున్నప్పుడు ఆయన వాహనానికి ముందు రోప్ పార్టీ లేదు. కాన్వాయ్ తో పాటు ఉండే పోలీసు వాహనాలు తప్ప.. అదనంగా పోలీసులను ఆయన వస్తున్నప్పుడు ఏర్పాటు చేయలేదు.
వివరణ : అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్పీని కలిసినప్పుడు.. అనుమతులు అడిగింది దేని గురించి. కేవలం మూడు గంటల కార్యక్రమం అని చెప్పారు. 9 గంటలకు తాడేపల్లిలో బయల్దేరి 11-12 గంటల మధ్యలో రెంటపాళ్లలో పరామర్శలు పూర్తిచేసుకుని తిరిగి వెళ్లిపోతారని చెప్పారు. కానీ చేసిందేమిటి? డీజే లు పెట్టి, భారీగా డ్యాన్సులు చేసే కిరాయి మనుషుల్ని గుంపులుగా తరలిస్తూ జాతర లాగా ఊరేగింపు చేశారు. తాడేపల్లిలో బయల్దేరి రెంటపాళ్ల వెళ్లవలసిన జగన్ కు గుంటూరు రోడ్ల పొడవునా జనాన్ని పోగేశారు. గుంటూరు కూడళ్ల వద్ద స్వాగత కార్యక్రమాలను స్థానిక నాయకులు ఏర్పాట్లు చేశారు.
యాత్ర పొడవునా రోప్ పార్టీ పెట్టాలని ఎలా కోరుకుంటారు? వాళ్లేమైనా రోడ్ షో చేస్తున్నాం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని వారు కోరారా? కనీసం తొలుత పోలీసులు రిజెక్ట్ చేసిన లేఖలోనైనా అలాంటి పదం వాళ్లు వాడారా? అదేమీ లేకుండానే.. జగన్ కాన్వాయ్ కు ముందు పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేయాలని ఎలా డిమాండ్ చేస్తారు? అలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం చవకబారుతనం అవుతుందనే సంగతి వారికి తెలియదా?
పోలీసులకు వాళ్లు మార్గం మొత్తం రోడ్ షో ఉంటుందని చెప్పలేదనే అనుకుందాం. కానీ.. తమ పార్టీ స్థానిక నాయకులు రోడ్ల మీద జనాన్ని పోగేసి స్వాగత ఏర్పాట్లు చేస్తున్న సంగతి వారికి తెలుసు కదా? మరి తమ పార్టీ కార్యకర్తలతో లేదా బౌన్సర్లతో తమ కాన్వాయ్ కు తామే స్వయంగా రోప్ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు కద. ఆ మాత్రం ఆర్థిక స్తోమత పార్టీకి లేదా? అనేక ప్రెవేటు కార్యక్రమాలకు వాళ్లే సొంతంగా కనీస భద్రత ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది కదా?
జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఇదంతా కాదు. ఆయన కేవలం పోలీసులు కల్పించిన భద్రతకు మించి.. ఆర్భాటం చేయాలని ప్రతిసారీ ప్రయత్నిస్తున్నారు. తద్వారా తనకు కల్పించిన భద్రత సరిగా లేనేలేదని ఆరోపణలు చేయడానికి కుట్ర పన్నుతున్నారు. తనకు ఒక్కచాన్స్ ఇచ్చిన ప్రజలు ఆయన పరిపాలన రుచిచూసిన తర్వాత ఛీత్కరించుకుని.. కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా సరే.. జగన్ తాను ఇంటినుంచి బయల్దేరితే చాలు.. పోలీసులు తన వాహనం ముందు రోప్ పట్టుకుని.. పరుగులు తీస్తూ ఉండాలని, అహంకారంతో కూడిన కలలు కంటున్నారు. ఇది ఆయనలో దురహంకారానికి, పెత్తందారీ పోకడలకు నిదర్శనంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.