పోలీసు అనుమతులను ఉల్లంఘించడమే తన లక్ష్యంగా, వారిని రెచ్చగొట్టేలా ధిక్కరణలకు పాల్పడడమే ధ్యేయంగా జగన్ సాగించిన రెంటపాళ్ల యాత్రలో.. సొంత పార్టీ కార్యకర్త, దళితుడైన చీలి సింగయ్య దుర్మరణం పాలైన పాపం జగన్ దళాలను అంత సులువుగా విడిచిపెట్టేలా లేదు. జగన్ ప్రయాణిస్తున్న కారు కింద చీలి సింగయ్య పడిన తర్వాత.. కారు ముందు చక్రం కింద అతనుండగానే.. కారుతో అతడిని ఈడ్చుకుంటూ వెళ్లిన వైనం చాలా స్పష్టంగా వీడియోల్లో బయటకు వచ్చింది. కాగా ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి జగన్ దళం మొత్తం క్వాష్ పిటిషన్లు వేశారు. అవి విచారణలో ఉండగానే.. వాహనం కండిషన్ లో లేనందువలన ప్రమాదం జరిగినట్టుగా మసిపూసి మారేడుకాయ చేయడానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్ ప్రయాణించిన వాహనాన్ని ఆర్టీఏ అధికారులతో పరిశీలింపజేసి బండి ఫిట్నెస్ మొత్తం బాగున్నట్టుగా తేల్చి నివేదికలు తయారుచేయించారు.
జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి దళితుడు చీలి సింగయ్య అన్యాయంగా చచ్చిపోయాడు. కాగా.. ఏ వాహనం కింద పడడం వల్ల ప్రమాదం జరిగిందనే విషయంలో పోలీసులను వైసీపీ వారు తొలుత తప్పుదారి పట్టించారు. కానీ.. వీడియో సాక్ష్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. స్వయంగా జగన్ వాహనమీ బలి తీసుకున్నట్టుగా తేలింది. అయితే.. వాహనం ఫిట్నెస్ సరిగా లేదని.. అందువల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని మాయ చేయాలనే ఆలోచనకు వచ్చారు. వారు ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేలోగానే.. పోలీసులు వచ్చి వాహనాన్ని స్వాధీనం చేసుకని తీసుకువెళ్లారు. వైఎస్ జగన్ వాహనాన్ని పోలీసులు తీసుకువెళ్లిపోయారు.. జగన్ ను చంపేయాలని అనుకుటున్నారు. ఆయనకు భద్రత లేకుండా చేస్తున్నారు.. వంటి రకరకాల మాటలతో వైసీపీ దళాలు నానా రభస చేశాయి. కానీ.. పోలీసులు వాహనాన్ని తీసుకువెళ్లి.. ఆర్టీయే అధికారులతో పరిశీలింపజేశారు. బ్రేకులు సిస్టమ్ అన్నీ పక్కాగా ఉన్నాయని వారు తేల్చారు. రికార్డుల పరంగా వాహనం ఇదేనని కూడా తేల్చారు. ఇప్పుడు వాహనం మీదకు నెపం నెట్టి జగన్ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ కేసులో వాహనంలో ప్రయాణిస్తున్న వారందరి మీద ఎలా కేసులు పెడతారంటూ జగన్ తరఫు వాదనలు వినిపిస్తున్నారు. వాహనంలో ఉన్న జగన్ ఏ2 కాగా, డ్రైవరు ఏ1 గా ఉన్నారు. మిగిలిన నిందితులుగా పార్టీ నాయకులు ఉన్నారు. అయితే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు.. వాహనంలో ఉన్నవాళ్లందరూ నిందితులే అవుతారని చెప్పే సుప్రీం తీర్పులను ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. వాహనం కింద సింగయ్య పడడం వరకు కేసు ఎలాగైనా సాగవచ్చు గానీ.. అంత తొక్కిసలాట, తోపులాటలకు కారణమయ్యేలా.. భారీ జనసందోహం తరలివచ్చేలా.. అనుమతులు లేని ర్యాలీని నిర్వహించినందుకు.. కార్యకర్తల్లో తొక్కిసలాటకు దారితీసేలా.. వాహనం నుంచి బయటకు వచ్చి కరచాలనాలు ఇస్తూ ప్రేరేపించినందుకు.. జగన్- సింగయ్య మరణానికి స్వయంగా కారకుడని పలువురు భావిస్తున్నారు.