సవాలు స్వీకరిస్తే శుద్ధపూసే లెక్క.. ధైర్యముందా జగన్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మతం క్రిస్టియానిటీనే కావొచ్చు గాక. కానీ ఆయనలో అనల్పమైన దైవభీతి, విశ్వాసం ఉన్నాయనేది ఆయనను ఎరిగిన వారు చెబుతుంటారు. హిందూ ఆలయాలను సందర్శించినప్పుడు, మెజారిటీ ఓటు బ్యాంకు హిందువులు గనుక, హిందూ మత సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆయన చాలా కృతకంగా వ్యవహరిస్తూ ఉండవచ్చు గాక.. కానీ కనీసం తన సొంత మతం పట్ల ఆయనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నదని అంటూ ఉంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తన చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అందివచ్చింది. నారా లోకేష్ సవాళ్లను స్వీకరించి సింపుల్ గా ఒక ప్రమాణం చేయగలిగితే చాలు.. ఆయన మీద నిందలన్నీ దూదిపింజెల్లా తేలిపోయే పరిస్థితి. పాలకపక్షం మళ్లీ మళ్లీ ఆయన మీద నిందలు వేయకుండా ఉండే పరిస్థితి. మరి ఈ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకుంటారా? అనేదే ప్రస్తుత చర్చ.

మంత్రి నారా లోకేష్.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్ట్రెయిట్ గా ఒక సవాలు విసిరారు. ‘మద్యం వ్యవహారంలో తప్పుడు కేసులు పెడుతున్నారని అంటున్న జగన్మోహన్ రెడ్డి అందులో తాను ఒక్క పైసా కూడా తీసుకోలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాలు విసురుతున్నా.’ అని లోకేష్ అన్నారు. జగన్ అలాంటి ప్రమాణం చేయగలిగితే.. సవాలుకు కట్టుబడి.. ఆయన మీద లిక్కర్ స్కామ్ లో అవినీతి నిందలు వేయడాన్ని పాలకపక్షం కట్టిపెట్టాలి. ఈ సవాలును స్వీకరించే ధైర్యం జగన్ కు ఉంటుందా? అనేది ఇప్పుడు ప్రజల్లో నడుస్తున్న చర్చ! మూడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని పాలకులు కాజేసిన లిక్కర్ కుంభకోణం అనేది ఇప్పుడు యావత్ దేశాన్ని కుదుపుతున్న సంగతి. ఏపీలో లిక్కర్ కొత్త పాలసీ పేరుతో  జగన్ దళాలు ఏం చేశారో ఎలా దోచుకున్నారో దేశం మొత్తానికీ అర్థమైంది. తన చుట్టూ ఉన్న కీలక అనుచరులు అందరినీ రకరకాల తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తున్న జగన్మోహన్ రెడ్డి.. ఏ క్షణాన అరెస్టులు తన దాకా వస్తాయని భయపడుతున్నారో అనుకునేట్లుగా పరిస్థితి ఉంది.

‘లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదు. ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా కాజేయలేదు. ఇప్పుడు కేసులో ఉన్నవారు, అరెస్టు అయిన వారు అందరూ శుద్ధపూసలు’ అని ఎంత మొత్తుకున్నా సరే.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కనీసం లిక్కర్ స్కామ్ లో తాను ఒక్క రూపాయైనా ముట్టలేదు.. అని లోకేష్ చెబుతున్నట్టుగా జగన్ దేవుడి మీద ప్రమాణం చేయగలరా? అనేదే ఇప్పుడు చర్చ. తాను కృతకంగా క్రతువులు నిర్వహించే హిందూదేవుళ్ల మీద కాకుండా, బైబిలు మీద, ఏసు ప్రభువు మీద ప్రమాణం చేసి జగన్ ఆ మాటలు చెప్పగలరా? అనేది గమనించాలి. మద్యం డిస్టిలరీలనుంచి ముడుపుల సొమ్ములు ఎప్పుడెప్పుడు ఏయే రూపాల్లో దారి మళ్లాయో.. వైసీపీ పెద్దల ఖాతాల్లోకి, ఖజానాల్లోకి చేరాయో పక్కా ఆధారాలతో కేసు నడుపుతుండగా.. అసలు అత్యంత పారదర్శకమైన తమ లిక్కర్ పాలసీలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదనే బొంకులతో ప్రజలను నమ్మించగలరని జగన్ దళాలు ఎలా భావిస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories