వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన విధ్వంసకర రోడ్ షో లో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించి అరెస్టు అయిన రవితేజ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్త అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు తెగ మురిసిపోతున్నారు. అలాంటి ప్లకార్డులు, ఫ్లెక్సిలు పట్టుకున్నది మా పార్టీ కార్యకర్త కాదు.. తెలుగుదేశం వాళ్లే అని ఒక వర్గం వైసీపీ మురిసిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మరీ చోద్యం.. ఆయన ఆనందం పీక్స్ లో ఉంది. ‘పాపం అతను ఒకప్పుడు తెలుగుదేశం కార్యకర్తే ఏమో.. ఆయనే చంద్రబాబు పాలనతో విసిగిపోయి ఆయన ఏ హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహంతో.. మన పార్టీ అభిమానస్తుడిగా మారాడేమో.. మనం గెలవాలని కోరుకుంటున్నాడేమో.. చంద్రబాబును నరకాలని ఆశపడుతున్నాడేమో’ అని తెగ మురిసిపోతున్నారు. 88తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజ అనే యువకుడి తెలుగుదేశం సభ్యత్వం కార్డు దొరకడం వలన.. ఈ రకంగా మెలికలు పెట్టి చంద్రబాబును విమర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అతని తెలుగుదేశం సభ్యత్వ కార్డు వెనుక ఉన్న ఒక అసలు సీక్రెట్ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.
సదరు రవితేజ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. వైఎస్సార్ కాంగ్రెస్ పిచ్చే ఎక్కువ. అయితే.. తెలుగుదేశం పార్టీ భారీస్థాయిలో సభ్యత్వ నమోదు డ్రయివ్ నిర్వహించిన రోజుల్లో దానికి ఆకర్షితుడు అయ్యాడు. వైసీపీ సభ్యత్వం ఉన్నంత మాత్రాన.. తన జీవితానికి ఒరిగేదేమీ లేదు. కానీ జగన్ అంటే పిచ్చి మాత్రం ఉంది. ఏదో టెక్నికల్ గా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే.. తనకు నయాపైసా ఖర్చు లేకుండా బీమా వస్తుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరణం సంభవించినా, పెద్ద ప్రమాదానికి గురై గాయపడినా, వికలాంగుడైనా భారీగా బీమా పరిహారం అందుతుంది. ఇలాంటి సదుపాయం తెలుగుదేశం పార్టీలో ఉన్నది తప్ప.. వైసీపీలో లేదు! అనే అశాతోనే అతను టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం సభ్యత్వం ఉన్న వ్యక్తి తన ప్రదర్శనలోకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని అరెస్టు అయినందుకు జగన్మోహన్ రెడ్డి కించిత్తు సానుభూతి అయినా చూపించలేదు. అలాంటి మాటలు కూడా ఉచ్చరించలేదు. మంచిదే కదా అని వెకిలి నవ్వులు నవ్వుతూ అన్నారు. కానీ.. ఆయన తెలుసుకోవాల్సింది ఒకటుంది. ఆయనను పిచ్చిగా అభిమానించే యువకులు కూడా.. తమ జీవితం గురించిన భద్రతపై ఆలోచన వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం మేలు అని ఆలోచిస్తున్నారన్నమాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కూలీల్లాగా, తమ చెప్పుకింద మనుషుల్లాగా వాడుకోవడమే తప్ప వారి సంక్షేమం కోసం వీసమెత్తు ప్రయత్నం, ఆలోచన చేయడం లేదనేది పార్టీ అధినేతగా ఆయన గ్రహించాలి. ఏదో బీమా కలిసి వస్తుందని ఇవాళ తెలుగుదేశం సభ్యత్వం తీసుకునే జగన్ పిచ్చిగల వాళ్లు.. క్రమంగా.. తెలుగుదేశం పాలన రుచించి ఆ పార్టీకే కట్టుబడిపోతే.. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దక్కిన 11 సీట్లు కూడా దక్కవని ఆయన గమనించాలని ప్రజలు అంటున్నారు.