వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ.. ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రం ఇప్పటికీ అలాగే వర్ధిల్లుతోంది. ఏ కోటరీ కారణంగా అయితే పార్టీ సర్వనాశనం అయిపోయిందని పార్టీనుంచి బయటకు వెళ్లిన వారందరూ బీభత్సంగా ఆరోపణలు చేస్తూ వచ్చారో.. ఆ కోటరీ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. పార్టీలోని సాధారణ నాయకులు, ఓడిపోయిన నాయకులు వెళ్లిపోవడం ఒక ఎత్తు. చివరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా కోటరీ కారణంగానే రాజీనామా చేసి వెళ్లిపోయారు.
జగన్ చుట్టూ చాలా బలంగా ఏర్పడి, ఆయన కదలికల్ని కూడా శాసించే స్థితికి చేరుకున్న సదరు కోటరీలో జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పుండు పెట్టినట్టుగా కనిపిస్తోంది. కోటరీలోని ఒక ముఖ్య నాయకుడు, బాబాయి వైవీ సుబ్బారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డిలో కొత్తగా అనుమానాలు పుట్టేలాగా ఇవాళ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ జమానాలో ముమ్మరంగా ఫోను ట్యాపింగ్ జరిగినప్పుడు.. తన ఫోను కూడా ట్యాప్ అయిన సంగతి తనకు అప్పుడే తెలుసునని, బాబాయి వైవీ సుబ్బారెడ్డి అప్పట్లోనే తన వద్దకు వచ్చి ఆ విషయం చెప్పి, తన ఫోను ట్యాప్ చేసి సేకరించిన ఆడియో రికార్డును కూడా వినిపించారని షర్మిల ఆరోపిస్తున్నారు.
ఫోను ట్యాపింగ్ అనేది తెలంగాణ రాజకీయాలను కుదుపుతున్న సంగతి అందరికీ తెలుసు. చాలా పెద్ద నేరంగా పరిగణించదగిన ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులందరినీ ఇప్పుడు దర్యాప్తుబృందాలు విచారిస్తున్నాయి. తెరవెనుకనుంచి నడిపించిన రాజకీయ నాయకుల పేర్లు మాత్రమే బయటకు రావాల్సి ఉంది. అదే జరిగితే.. కేసీఆర్ సహా గులాబీ అగ్రనాయకులు పలువురు కటకటాల వెనక్కు వెళ్లక తప్పదనే అంచనాలు కూడా సాగుతున్నాయి. అయితే.. ఈ దందా తెలంగాణకు పరిమితం కాదని.. కేసీఆర్ అమితంగా ప్రేమించే అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నదని రెండు రోజులుగా వెలుగులోకి వచ్చింది.
వైఎస్ షర్మిల ఫోన్ కాల్స్ ను కూడా ట్యాప్ చేసి.. ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేసినట్టుగా బయటకు పొక్కింది.
ఈ విషయంపై ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన పీసీసీ సారథి వైఎస్ షర్మిల విశాఖలో మాట్లాడుతూ.. తన ఫోనుతో పాటు, తన భర్తది, తన దగ్గరివాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారనే సంగతి పచ్చి నిజం అని. కావలిస్తే బైబిలు మీద ప్రమాణం చేసి అయినా చెప్పగలనని, విచారణ కోసం ఎక్కడకు రమ్మన్నా వస్తానని అంటున్నారు. అప్పట్లోనే బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఆ విషయం తనకు చెప్పి నిర్ధారించారని చెబుతున్నారు. తన ఇంటికి వచ్చి మరీ ఒక ఫోన్ కాల్ ఆడియో వినిపించారని కూడా చెబుతున్నారు.
అదే సమయంలో షర్మిల మరొక మాట కూడా అంటున్నారు. తన మేనల్లుడు, మేనకోడళ్లకు చెందాల్సిన ఆస్తిని కాజేయడానికి జగన్ కుట్రపన్ని కేసులు నడపడం మొదలయ్యాక, వైవీతో అనేక అబద్ధాలు చెప్పించారని, ఆ పరిస్థితుల్లో ఆయన ట్యాపింగ్ సంగతుల్ని ఒప్పుకుంటారని అనుకోవడం లేదని కూడా చెబుతున్నారు.
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరీలోని వ్యక్తులో బాబాయి వైవీ సుబ్బారెడ్డి మీద జగన్ లో కొత్త అనుమానాలు పుట్టేలా షర్మిల వ్యాఖ్యలు ఉండడం విశేషం. దీని పరిణామాలు ఎలా ఉంటాయోనని పలువురు ఊహాగానాలు చేస్తున్నారు.