ప్రాణాలు తీసే పంతాలు ఎందుకు జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి పంతానికి పోతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలతో పోలీసు శాఖ కొన్ని నిబంధనలను విధిస్తే వాటిని అతిక్రమించడం తన హక్కు అన్నట్లుగా జగన్ వ్యవహరించాలనుకుంటున్నారు. సత్తెనపల్లి మండలంలో రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆయన కుటుంబాన్ని పరామర్శించడం అనే ఎజెండాతో బుధవారం పర్యటించాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల ప్రాణాలను బలిపెట్టేలాగా పంతానికి పోతుండడం గమనించాల్సిన సంగతి.
జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటించదలచుకుని ఆయన పార్టీ తరఫున అనుమతి కోసం పోలీసులకు లేఖ కూడా ఇచ్చిన తర్వాత, డిఎస్పి ఆ గ్రామంలో పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. జగన్ కార్యక్రమం ఉంటుందని చెబుతున్న వీధి కేవలం 10 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉన్నదని గుర్తించారు. అందువల్ల భారీ జన సందోహం వస్తే తొక్కిసలాట తప్పదని అనుకుంటున్నారు. కేవలం అలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు తక్కువ జనాభా వచ్చేలా చూసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించడం జరిగింది. అదే సమయంలో గ్రామ శివారులో కార్యక్రమం పెట్టుకున్నట్లయితే ఎంతమంది హాజరైనాసరే తాము అనుమతులు ఇస్తామని పోలీసులు చెప్పిన సంగతిని కూడా గుర్తు చేసుకోవాలి. కానీ జగన్ దళాల వ్యవహార సరళి- ‘హిత వాక్యములు తమ చెవికెక్కవు కదా’ అన్నట్లుగా ఉంటున్నది.

అనుమతుల కోసం పల్నాడు ఎస్పీని మంగళవారం నాడు కూడా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వచ్చిన తర్వాత రెచ్చిపోయి మాట్లాడారు. అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ పర్యటన జరిగి తీరుతుంది ..అని అన్నారు. తాము జనాన్ని తరలించబోమని పోలీసులకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే జనాన్ని తరలించే విషయంలో వారు మాట నిలబెట్టుకుంటారనే గ్యారెంటీ లేదు. కేవలం ‘తరలించము’ అని చెప్పడం మాత్రమే కాదు జనాన్ని తరలివస్తే ‘వారిని నియంత్రించే బాధ్యత తాము తీసుకుంటాము’ అని కూడా పార్టీ హామీ ఇవ్వగలిగితేనే వారి నిజాయితీని నమ్మవచ్చు. కానీ సత్తెనపల్లి యాత్రలో కూడా ఏదో ఒక గొడవ జరగాలనే కోరికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిశయంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఎక్కువమంది జనం వద్దు అని పోలీసులు చెబుతున్న కొద్ది జగన్మోహన్ రెడ్డి మరింత పంతానికి పోతున్నారు. మరింత ఎక్కువగా జనాన్ని తరలించాలని పార్టీ నాయకులు అనధికారికంగా పురమాయిస్తున్నట్లు సమాచారం. తద్వారా అక్కడ తొక్కిసలాటలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అందుకు బాధ్యులు ఎవరు? అసలే ఇటీవల కాలంలో రకరకాల దుర్మార్గపు ఘటనల్లో అనేక మంది అమాయకులు అసువులు బాస్తున్నారు. కేవలం తొక్కిసలాటలోనే మొన్నటికి మొన్న బెంగుళూరు క్రికెట్ అభిమానులు ఎందరు చనిపోయారో ప్రజలకు తెలుసు.పోలీసులు చెబుతున్నట్లుగా అంత ఇరుకు సందులో తాను ఆశిస్తున్నట్లుగా వేల మంది జనాన్ని ఒకే సమయంలో పోగేస్తే ఎలాంటి తొక్కిసలాట జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి ఊహించలేకపోతున్నారా?అనేది ప్రజలలో మెదలుతున్న సందేహం.కేవలం తన పంతం నెగ్గడం కోసం ఆయన కార్యకర్తల ప్రాణాలను బలి పెడుతున్నారని వారి జీవితాలతో ఆడుకుంటున్నారని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories