మరో రచ్చకు వేదిక సృష్టించుకుంటున్న జగన్!

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, తనను చంపించడానికి కుట్రలు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటూ తద్వారా ప్రజల సానుభూతి సంపాదించి తద్వారా రాజకీయ మైలేజీ తెచ్చుకోవాలనేది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం. చావులు, పరామర్శలు ఏ పేరు చెప్పి ఏ ఊర్లో పర్యటించినా సరే.. ఆయన ప్రథమ లక్ష్యం మాత్రం అదే. అక్కడ తన యాత్రలో అల్లర్లు జరగాలి.. అవన్నీ తన మీద కుట్రలు అంటూ.. తన పార్టీ వారు కొన్ని నెలల పాటూ రాద్ధాంతం చేస్తూ ఉండాలనేదే ఆయన ప్లాన్. ఇలాంటి ప్లాన్ అమలు చేయడానికి తాజాగా ఆయన కొత్త సందర్భాన్ని కూడా సృష్టించుకున్నారు. భద్రత ఏర్పాట్లు ప్లాన్ చేసుకోవడానికి పోలీసులకు అవసరమైన వివరాలు ఇవ్వకుండా, తన కార్యక్రమానికి అనుమతి కావాలంటూ లేఖ ఇవ్వడం ఇలాంటి కుట్రలో భాగంగానే ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి బుధవారం జగన్ వెళ్లబోతున్నారు. అయితే కార్యక్రమానికి ఎంతమంది వస్తారనే వివరాలేమీ ఇవ్వకుండా అనుమతి కోసం, భద్రత ఏర్పాట్ల కోసం ఆ పార్టీ పోలీసులకు లేఖ ఇవ్వడం కుట్రలో భాగంగానే కనిపిస్తోంది.

రెంటపాళ్ల గ్రామంలో పది అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న ఒక సన్నటివీధిలో కార్యక్రమం నిర్వహించుకోవడానికి పోలీసు అనుమతి కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు పోలీసులకు లేఖ ఇచ్చారు. అయితే అందులో పూర్తి సమాచారం లేదనేది జిల్లా ఎస్పీ అభ్యంతరం!  ఎంతమంది వస్తున్నారు? ఎన్ని కార్లు వస్తున్నాయి? వంటి వివరాలతో మళ్లీ లేఖ ఇవ్వాలని కోరినా పార్టీ స్పందించలేదని జిల్లా ఎస్పీ అంటున్నారు. దాదాపు ముప్ఫయి వేల మంది కార్యకర్తలను తరలించే అవకాశం ఉన్నదని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంత ఇరుకు సందులో కార్యక్రమం ప్రమాదం అని.. సభ గ్రామ శివార్లలో నిర్వహించుకునేట్లయితే అనుమతులు ఇస్తాం అని అంటున్నారు. నిబంధనల ప్రకారం సభకు వారం ముందు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది గానీ.. వైసీపీ వారు ఇంకా పూర్తి వివరాలతో లేఖ ఇవ్వకపోవడం పట్ల ఎస్పీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

భద్రత ఏర్పాట్లు చేయడానికి పోలీసులతో సహకరించకపోవడం, వారి అనుతులను పట్టించుకోకపోవడం ద్వారా.. ఏదో ఒక రభస జరిగేలా చేయడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్కెచ్ అనేది ప్రజలు గమనిస్తున్నారు. అనంతపురం జిల్లా పాపిరెడ్డి పల్లెలో గానీ, మొన్నటికి మొన్న పొగాకు రైతుల పరామర్శ అనే ప్రహసనం నడిపించినప్పుడు పొదిలిలో గానీ జరిగింది ఇదే. పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం, నిబంధనల ప్రకారం నడచుకోకపోవడం వల్లనే రభసలు జరిగాయి. అక్కడ ఏదో ఒక రచ్చ చేసి, ఆ వెంటనే.. జగన్ మీద హత్యాయత్నానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదంటూ ప్రచారం చేయడం వైసీపీ నేతలకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సత్తెనపల్లి రెంటపాళ్ల కార్యక్రమానికి కూడా పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వకుండా అనుమతులు కావాలని అడగడం కుట్రలో భాగమనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కార్యక్రమానికి ఇంకా ఒక్కరోజు గడువు మాత్రమే ఉండగా.. పోలీసుల అనుమతి గురించి, భద్రత ఏర్పాట్లకు సహకరించడం గురించి  వైసీపీ నేతలు పట్టించుకోకపోవడం గమనిస్తే.. ఇక్కడ మరో రచ్చ చేయడమే వారి లక్ష్యంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories