మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు యాత్రకు వస్తున్నారంటే కార్యకర్తలకు గండమేనా? ఆయన రాకవల్ల, ప్రతి పర్యటన వల్ల అటు స్థానిక నాయకులు, కిరాయికి తరలించే కార్యకర్తలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారా? జగన్ టూర్లకు రావాలంటే.. జనం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఏడాది తర్వాత.. పొగాకు రైతుల కష్టాలను పరిశీలిస్తానంటూ పొదిలియాత్ర పెట్టుకుంటే అక్కడ నానా రాద్ధాంతమూ అయింది. ఆయన పర్యటనలో పాల్గొన్నంతవరకు పరిమితమై ఉంటే చాలా బాగుండేది. కానీ.. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి వైసీపీ గూండాలు రెచ్చిపోయి మహిళలు, పోలీసుల మీద రాళ్లు రువ్వి, చెప్పులు విసిరి నానా గందరగోళం చేయడం వల్ల ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. దాదాపు 25 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. అసలు వైఎస్ జగన్ టూర్ అంటేనే.. కార్యకర్తలకు గండం అని.. కేసుల బెడద తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి యాత్రకు వస్తున్నారంటే ముందుగా నాయకులు జడుసుకుంటున్నారు. ఏ కారణం చూపి ఆయన యాత్ర చేస్తున్నా సరే.. ఆయన ఆ ఒక్క వ్యవహారానికి పరిమితం కావడం అనేది జరగడం లేదు. పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు తప్ప చావులకు వెళ్లినా సరే.. కొన్ని కిలోమీటర్ల పాటు ఆయన రోడ్ షోలు నిర్వహించడం అనేది ఒక ప్రచార వ్యూహంగా పెట్టుకున్నారు. సదరు రోడ్ షోలకు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించాలనేది నిబంధన. అసలే ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టినా, దారుణంగా ఓడిపోయి నాయకులు నానా కష్టాల్లో ఉన్నారు. పార్టీనుంచి ఏ కార్యక్రమానికీ ఒక్క రూపాయైనా ఖర్చుల నిమిత్తం విదిలించడం లేదని వారి బాధ. ఖర్చులన్నీ స్థానిక నేతలే పెట్టుకోవాలి. ఇంతా చేసి జనాన్ని తరలిస్తే మళ్లీ కేసుల బెడద అదనం.
జగన్ పర్యటనల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చూడాలనేది ఒక అప్రకటిత సూచనలాగా ఉన్నట్టు పలువురు అనుమానిస్తున్నారు. అలాటివి అనేక సంఘటనలు జరిగితే.. వాటన్నింటినీ బూచిగా చూపించి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, జగన్ కు భద్రత ఇవ్వడం లేదని ప్రచారం చేయాలనేది వైసీపీ వ్యూహం. వారి వ్యూహం కోసం ఆయన పర్యటనల్లో అల్లర్లు చేయాలి. అల్లర్లు చేసిన కార్యకర్తలు అమాయకంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ వద్ద అదే జరిగింది. పొదిలిలో కేవలం నల్ల బెలూన్లు పట్టుకున్న వారి మీదికి ఉసిగొల్పడం వలన.. రాళ్లు రువ్విన పోలీసులను గాయపరచిన దాదాపు పాతికమంది ఇప్పుడు అరెస్టు అయ్యారు. ఈ కోణంలో గమనించినప్పుడు.. వైఎస్ జగన్ యాత్రలన్నీ కూడా ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద గండంగా మారుతున్నాయని అంతా అనుకుంటున్నారు.