బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ లో ప్రతి వారాంతాన్నీ విలాసంగా గడుపుతూ ఉండే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆ విలాసాల నడుమ బోరు కొట్టినప్పుడు.. అప్పుడప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒకటి రెండు రోజులు పార్టీ సమావేశాల పేరుతో హడావుడి చేసి ప్రజలను పట్టించుకుంటున్న రాజకీయ నాయకుడి లాగా బిల్డప్ ఇచ్చి ఆ వెంటనే బెంగుళూరు పారిపోవడం కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్ సకుటుంబంగా వెళ్ళిపోతుంటారు. అయితే ఈసారి గురువారమే వెళ్ళిపోయారు. బుధవారం నాడు పొగాకు రైతుల కష్టాలను తెలుసుకుంటానంటూ.. ఆ రైతులను పరామర్శిస్తానంటూ.. ఒక చిన్న నాటకీయ ఎపిసోడ్ నడిపించిన జగన్మోహన్ రెడ్డి.. అక్కడి వ్యవహారం తన అంచనాలకు భిన్నంగా సాగే సరికి బెదిరిపోయారా? అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి. గురువారం నాడు గుంటూరులో పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమం ముందే షెడ్యూలు చేసుకున్నప్పటికీ దానిని రద్దు చేసుకుని బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోవడం గమనార్హం.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా గత ఏడాది రోజులలో ప్రజల గురించి పట్టించుకున్న సందర్భాలు ఎన్ని అని లెక్క తీయదలుచుకుంటే మునివేళ్ళ మీద చెప్పవచ్చు. సూటిగా పేర్కొనాలంటే గుంటూరు మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన సందర్భం తప్ప ఆయన ప్రజల కష్టాల గురించి గళం విప్పిన దాఖలాలు లేవు. తాను ఓడిపోయి ఏడాది పూర్తయిన తర్వాత పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు అనే అంశం మీద గళం విప్పాలని ఆయనకు అనిపించింది. పరామర్శ సంగతి తర్వాత ముందుగా తన ప్రచారం ఘనంగా ఉండేలాగా జనాన్ని పోగేయడానికి అవకాశం ఉంటుందని ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు ఆయన వెళ్లారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో అసలు ఒక్క రైతుతో కూడా మాట్లాడకుండా, రైతు ప్రతినిధులతో చర్చించకుండా తన పరామర్శ యాత్రను పూర్తి చేశారు. ప్రభుత్వం మీద తాను తలచిన రీతిలో బురద చల్లారు. హెలిపాడ్ నుంచి పొగాకు కేంద్రం వరకు వెళ్లడానికి మూడు కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహించి తన రాజకీయ ప్రయోజనాల కక్కుర్తిని ప్రదర్శించారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో.. అక్కడి మహిళలు నల్ల బెలూన్లతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నంలో ఉండగా, తన పార్టీ గుండాలతో వారి మీద రాళ్లు చెప్పులు వేయించారు. పైపెచ్చు తన మీదనే రాళ్లతో దాడి జరిగినట్లుగా ప్రచారం చేసుకున్నారు.
ఇంకా కలిపి గురువారం నాడు గుంటూరులో పొగాకు రైతులను పరామర్శించాలని ప్లాన్ చేసిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. పొదిలిలో మహిళల మీద తన పార్టీ గూండాలతో రాళ్లు చెప్పులతో దాడి చేయించినందుకు ప్రతిస్పందనగా గుంటూరులో ఈ సమయంలో తాను పర్యటిస్తే వ్యతిరేకత తప్పదని ఆయన భయపడ్డారనేది పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి పొగాకు రైతుల పరామర్శ కంటే బెంగళూరు ఎలహంక ప్యాలెస్ తనకు ముద్దు అని భావించి జగన్ పలాయనం చిత్తగించడం గమనార్హం.